NTV Telugu Site icon

తెలంగాణ సర్కార్‌పై సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసలు..

తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.. హ‌నుమ‌కొండలో నూత‌నంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోర్టుల ఆధునీక‌ర‌ణ‌తో ప్రజ‌ల‌కు స‌త్వర న్యాయం జరుగుతుందన్నారు.. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.. కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు న్యాయ సేవలు అందుతాయన్న ఆయన.. మౌలికవసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పని చేయాలని అనుకోవడం దురాశ అవుతుందన్నారు.. కాక‌తీయ రాజులు అందించిన ఘ‌న‌మైన వార‌స‌త్వానికి దీటుగా హ‌నుమ‌కొండ నూత‌న‌ కోర్టు భ‌వ‌నాలు తీర్చిదిద్దబ‌డ్డాయన్న ఆయన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక‌త ఉంది.. కేంద్రం నిధులు ఇవ్వక‌పోయినా.. తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చి కోర్టు భ‌వ‌నాల‌ను నిర్మించిందని.. న్యాయ వ్యవ‌స్థకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌర‌వం ఇది అంటూ ప్రశంసలు కురిపించారు.

Read Also: వ్యాక్సినేషన్‌.. భారత్‌ నుంచి 90కి పైగా దేశాలకు వ్యాక్సిన్లు..

ఇక, కోర్టుల్లో సౌక‌ర్యాల కోసం అన్ని రాష్ట్రాల నుంచి స‌మాచారం తెప్పించామని తెలిపారు సీజేఐ ఎన్వీ రమణ.. కోర్టుల్లో మౌలిక సౌక‌ర్యాల ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై జులైలో కేంద్రానికి ఇండియ‌న్ జ్యుడిషీయ‌రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేష‌న్ ఏర్పాటుపై ప్రతిపాద‌న పంపామని.. ఆధునీకర‌ణ ద్వారానే స‌త్వర న్యాయం అందిచగలమని చెప్పానని.. న్యాయ మంత్రిత్వ శాఖ‌, కేంద్రం నుంచి స‌మాధానం రావాల్సి ఉందన్నారు.. ప్రత్యేక సంస్థపై పార్ల‌మెంట్ స‌మావేశాల్లో చ‌ట్ట రూపంలో తెస్తార‌ని ఆశిస్తున్నానని తెలిపారు జస్టిస్‌ రమణ.. ఇక, ఈ సందర్భంగా స్వర్గీయ కాళోజీ నారాయణ రావు కవితలను చదివి వినిపించారు సీజేఐ.. తెలుగులో మాట్లాడటం గర్వంగా ఉందని.. ఓరుగల్లుతో తనకు ఎంతో విడదీయరాని బంధం ఉందంటూ గుర్తుచేసుకున్నారు.. ప్రగతిశీల ఉద్యమాలకు పుట్టినిల్లు ఓరుగల్లు అని.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నేల అని.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి శతకాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు జస్టిస్‌ ఎన్వీ రమణ.