బిగ్ బాస్ షో సీజన్ 5 లో కంటెస్టెంట్స్ చిత్ర విచిత్రమైన ఆటలు ఆడాల్సి వస్తోంది. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయడానికి మంగళవారం బిగ్ బాస్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ అనే గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా ఉదయం హౌస్ లోని మెంబర్స్ అందరి బరువును తూచి, ఓ బోర్డ్ మీద రాయించాడు. ఆ తర్వాత వాళ్ళంత గార్డెన్ ఏరియాలో ఉండగా, హౌస్ లోకి కొందరు ముసుగు మనుషులు వెళ్ళి, ఆహార పదార్థాలన్నీ తుడిచిపెట్టేశారు. అంతేకాదు… కంటెస్టెంట్స్ తమ పరుపుల కింద, సొరుగుల్లో దాచుకున్న ఫ్రూట్స్ ను కూడా బిగ్ బాస్ తీసేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరేసి సభ్యులను ఒక టీమ్ గా ఏర్పాటు చేశాడు. దాంతో జెస్సీ – కాజల్; సిరి – షణ్ముఖ్; రోబో – నటరాజ్; శ్రీరామ్ – హమీద; యాని – శ్వేత; ప్రియ – ప్రియాంక; విశ్వ – రవి; సన్ని – మానస్ ఒక్కో జట్టుగా ఏర్పడ్డారు. విశేషం ఏమంటే లైక్ మైండెడ్ వ్యక్తులే ఇలా జత కట్టారు. ఆ తర్వాత బిగ్ బాస్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ గేమ్ మొదలు పెట్టాడు. ఈ ఆట ఏమిటంటే… బిగ్ బాస్ చెప్పేవరకూ కంటెస్టెంట్స్ సాలీడ్ ఫుడ్ ఏదీ తీసుకోకూడదు. అందుకే ఆహార పదార్థాలను హౌస్ నుండి తీసేశారు. కేవలం లిక్వడ్స్ మాత్రమే స్వీకరించాలి. వాటిని టైమ్ టు టైమ్ బిగ్ బాస్ అందిస్తాడు. దాని ద్వారా వాళ్ళు కొంత వెయిట్ లాస్ అయ్యే ఆస్కారం ఉంది. ఆట ముగిసే సమయానికి ఏ జట్టు వ్యక్తుల బరువు తగ్గితే వారు కెప్టెన్సీ టాస్క్ కు అర్హులు అవుతారు.
పట్టుకోండి చూద్దాం!
కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ మరో తిరకాసు పెట్టాడు. కేవలం ఆహారం తీసుకోకుండా తగ్గడమే కాకుండా, అతను కొన్ని టాస్క్లు ఇస్తాడు. అలానే ఆహారం తీసుకోకుండా ఉండాలనుకున్న ఇంటి సభ్యులను టెంమ్ట్ కూడా చేస్తుంటాడు. థండర్ సౌండ్ రాగానే ఏ జట్టు వ్యక్తులు హౌస్ లోని బటన్ ను ప్రెస్ చేస్తారో వారిని పవర్ రూమ్ లోకి రమ్మని బిగ్ బాస్ కోరాడు. అలా తొలి ఛాన్స్ ను లోబో అండ్ నటరాజ్ మాస్టర్ పొందారు. వారికి అపొనెంట్ గా ఆడే గ్రూప్ ను ఎంపిక చేసుకునే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చాడు. వారు శ్రీరామ్ – హమీదా ను ఎంచుకున్నారు. ముక్కలుగా ఉన్న ఓ బకెట్ ను ఈ రెండు గ్రూపులు సెట్ చేసుకుని, బిగ్ బాస్ చెప్పే వస్తువులను చేతితో తాకకుండా ఆ బకెట్ లో వేసి హాల్ మధ్య లో ఉన్న పెద్ద డ్రమ్ లో వేయాల్సి ఉంటుంది. ఇన్ టైమ్ లో ఎవరైతే బిగ్ బాస్ చెప్పిన వస్తువులను అందులో వేస్తారో ఆ జట్టు విజేతగా నిలుస్తుంది. విశేషం ఏమంటే… గెలిచిన జట్టు వెయిట్ ను బిగ్ బాస్ 500 గ్రాములు తగ్గిస్తాడు. ఓడిన జట్టుకు 500 గ్రాముల బరువు పెంచుతాడు. అయితే ఈ ఆటను చురుకుగా ఆడి శ్రీరామ్ – హమీద టీమ్ విజయం సాధించింది.
ఇక ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తున్న ఇంటి సభ్యులను టెంమ్ట్ చేయడం కోసం బిగ్ బాస్ రాత్రి గార్డెన్ ఏరియాలోని పలహారశాలలో కొంత ఆహారం పెట్టాడు. తన ఆరోగ్యం దృష్ట్యా తాను స్వీకరిస్తానని విశ్వ కెప్టెన్ జెస్సీని అడిగి దానిని తిన్నాడు. బరువు తగ్గాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ సహజంగానే ఉంటుంది. టాస్క్ కోసం అలా చేయడాన్ని అందరూ పాజిటివ్ గా తీసుకున్నారు. లోబో, నటరాజ్ మాస్టర్ టాస్క్ ఓడిపోవడానికంటే ముందే వర్కౌట్స్ చేయడం మొదలెట్టారు. శ్రీరామ్ అర్థ కేజీ బరువు తగ్గడం తనకు పెద్ద సమస్య కాదంటూ ద్రవాహారం కూడా తీసుకోనని చెప్పాడు. ఎవరికి వారు తమ స్థాయిలో వ్యాయామం చేయడం మొదలు పెట్టారు. అయితే… మంగళవారం ఇంటి సభ్యులను క్రమశిక్షణలో ఉంచడంలో కెప్టెన్ జెస్సీ విఫలం కావడంతో బిగ్ బాస్ తీవ్రంగా మందలించాడు. దానికి సంబంధించిన పర్యవసానం ఏమిటనేది బుధవారం తెలుస్తుంది. అయితే సోమవారం నామినేషన్స్ సందర్భంగా జరిగిన వాదోపవాదాలను ఆ రోజు రాత్రి కొందరు, మంగళవారం ఉదయం కొందరు షార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆర్జే కాజల్ – రవి మధ్య సఖ్యత ఏర్పడకపోయినా, లోబో మాత్రం ప్రియ దగ్గరకు వచ్చిన తన బిహేవియర్ కు మన్నించమని కోరుతూ ఓ హగ్ ఇచ్చాడు. ఇక శ్వేతతో లవ్ ట్రాక్ నడపాలని భావించిన జెస్సీ ఆమెను ఉడికించడం మొదలు పెట్టాడు. తనను తాను విజయ్ దేవరకొండతో పోల్చుతూ లవ్ చేయొచ్చు కదా అని కోరాడు. బెంగళూరులో నా లవర్ ఉంది అని చెబుతూ ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతావ్ అంటూ శ్వేత జెస్సీ ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరించింది. మొత్తం మీద కెప్టెన్ గా తాను విఫలమవుతున్నానని తెలిసిన జెస్సీ… ఏ రకంగా లైమ్ లైట్ లోకి వచ్చి, వ్యూవర్స్ దృష్టిలో పడాలనుకుంటున్నట్టు అర్థమౌతోంది.
పాటతో ఆకట్టుకున్న శ్రీరామ్!
ఇక మంగళవారం అందరికీ ఆనందాన్ని కలిగించిన సంఘటన ఏదైనా ఉందంటే అది శ్రీరామ్ పాట పాడటం. సింగర్ అయిన శ్రీరామ్ ఓ చక్కని పాట ఎప్పుడు పాడతాడా అని వ్యూవర్స్ సహజంగానే ఎదురుచూస్తుంటారు. దానికి తగ్గట్టే… శ్రీరామ్ ‘జన్మనీదేలే… మరు జన్మనీకేలే…’ అనే విరహ గీతాన్ని పాడి మెప్పించాడు. ఆ సమయంలో అతని పక్కన కాజల్, ప్రియ, ప్రియాంక, హమీదా ఉన్నారు. ఈ పాట నా కోసమే పాడావు కదా అంటూ ప్రియాంక శ్రీరామ్ ను వెనక నుండి హగ్ చేసుకోగా, ‘హౌస్ లో ఉన్న అచ్చమైన ప్రేమికులందరికీ ఈ పాటను డెడికేట్ చేస్తూ పాడాను’ ను శ్రీరామ్ చెప్పడం కొసమెరుపు!