కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం ఉంది. ముఖ్యంగా మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ కూడా సభలు, పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ సీఎంను ప్రధాని మోడీ పొగడడం ఆశ్చర్యం కలిగించింది.
రాజస్థాన్ లో తొలి వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన అనంతరం కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను స్నేహితుడిగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభాలు ఉన్నప్పటికీ గెహ్లాట్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనను ప్రశంసించారు. తన ప్రసంగం చివరలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముందుకు వచ్చిన డిమాండ్లతో పాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న రాజకీయ గొడవలను ప్రధాని మోదీ ఎత్తి చూపారు.
Also Read:PVN Madhav : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు
గెహ్లాట్ అనేక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నారరని, అయినప్పటికీ, ఆయన అభివృద్ధి పనుల కోసం సమయాన్ని వెచ్చించి రైల్వే కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రధాని ప్రశంసించారు. తాను ఆయనకు స్వాగతం పలుకుతున్నానని ప్రధాని మోదీ చెప్పారు. జైపూర్ జంక్షన్ రైల్వేస్టేషన్లో వందేభారత్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ఇద్దరూ రాజస్థాన్కు చెందిన వారని ప్రధాని ప్రస్తావించారు. “మీ రెండు చేతుల్లో లడ్డూలు ఉన్నాయని నేను గెహ్లాట్ జీ చెప్పాలనుకుంటున్నాను… రైల్వే మంత్రి రాజస్థాన్కు చెందినవాడు చైర్మన్ రైల్వే బోర్డు కూడా రాజస్థాన్కు చెందినది” అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
ఇటీవల తెలంగాణలో సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలేదు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా రాష్ట్రంలో రాజకీయాలు సాగుతున్నాయి. అయితే, రాజస్థాన్ లో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి రేపింది. ఈ నేపథ్యంలోనే సీఎం గెహ్లాట్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.
Also Read:Bomb Threat: ఢిల్లీలో స్కూల్ కి బాంబు బెదిరింపు.. విద్యార్థుల్లో భయాందోళన
కాగా, ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అజ్మీర్ నుంచి ఢిల్లీ మధ్య నడుస్తుంది. జైపూర్, అల్వార్, గుర్గావ్లలో వందేభారత్ రైలు ఆగుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ అజ్మీర్ నుండి ఢిల్లీ వరకు 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది ఢిల్లీ నుండి అజ్మీర్ మధ్య 6 గంటల 15 నిమిషాలలో ప్రయాణిస్తుంది. అందువల్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ మార్గంలో నడుస్తున్న ప్రస్తుత వేగవంతమైన రైలు కంటే 60 నిమిషాలు వేగంగా ఉంటుంది.