నేడు సీఆర్డీఏ కీలక భేటీ.. మరో రూ.15,757 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనుంది సీఆర్డీఏ అథారిటీ.. ఇప్పటికే రూ.49,154 వేల కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ అథారిటీ అనుమతి ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు మరో 15,757 కోట్ల రూపాయల విలువైన పనులకూ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. మొత్తంగా రాజధాని అమరావతిలో రూ.64,912 కోట్ల పనులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. దీంతో, ఈ రోజు భేటీ కీలకంగా మారనుంది..
ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూప్రకంపలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జిల్లాలోని పలుచోట్ల ఈ రోజు స్వల్పంగా భూమి కంపించింది.. పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో సెకను పాటు స్వల్పంగా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. అయితే, భూప్రకంపన సమయంలో పెద్ద శబ్దాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.. పెద్ద శబ్దాలతో భూమి కంపించటంతో భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. కాగా, సోమవారం రోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించిన విషయం విదితమే.. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో సోమవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేసినట్టు స్థానికులు వెల్లడించారు.. అయితే, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం కాస్త తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు కంపించినట్లు స్థానికులు వెల్లడించారు.. కాగా, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు టెన్షన్ పెట్టిన విషయం విదితమే..
లిక్కర్ స్కాం కేసు.. కస్టడీలో సిట్ అధికారులకు చుక్కులు చూపిస్తోన్న రాజ్ కసిరెడ్డి..!
ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోన్న లిక్కర్ స్కాం కేసులో సిట్ విచారణలో నిందితులే సిట్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారట.. కస్టడీలో సిట్ అధికారులకు లిక్కర్ స్కాం కేసు నిందితులు రాజ్ కసిరెడ్డి, చాణక్య పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది.. గత నాలుగు రోజులుగా నిందితులను విచారిస్తున్నారు సిట్ అధికారులు.. నెలకి ఒక సిమ్ కార్డు నిందితులు వినియోగించినట్టు గుర్తించిన సిట్.. సిమ్ కార్డులు ఎవరు ఇచ్చారని అడగడంతో తాము కొత్త సిమ్ లు వాడలేదని నిందితులు చెప్పారట.. ఇక, తాను ఐటీ అడ్వైజర్ ను అని తనకు లిక్కర్ పాలసీతో సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి సమాధానం ఇచ్చారట.. ఇక, ఎంపీ మిథున్ రెడ్డి ఇతరులతో విజయసాయి రెడ్డి ఇంట్లో మీటింగ్ ఎందుకు పెట్టారని సిట్ ప్రశ్నించగా.. తామంతా పార్టీ నేతలం కాబట్టి పార్టీ ఎదుగుదల గురించి పార్టీ నేతలతో చర్చకు సమావేశమైనట్టు రాజ్ కసిరెడ్డి సమాధానం ఇచ్చారట.. మరోవైపు.. తనకు హైదరాబాద్లో టీ గ్రిల్స్ రెస్టారెంట్ ఉందని అక్కడకి రాజ్ కసిరెడ్డి వచ్చేవారని.. అక్కడ తమకు పరిచయమని తెలిపాడట చాణక్య.. రాజ్ కసిరెడ్డితో కేవలం పరిచయం మాత్రమే ఉందని.. ఎటువంటి లావాదేవీలు చేయలేదని చాణక్య చెప్పుకొచ్చారట.. డిస్టలరీస్ నుంచి వసూలు చేసిన ముడుపులు ఎవరికి ఇచ్చారని అడగ్గా.. అసలు కేసుతో సంబంధం లేనప్పుడు..? డబ్బులు ఎక్కడివి, ఎవరికి ఇస్తాను అని సిట్ అధికారులకు రాజ్ కసిరెడ్డి చెప్పినట్టు సమాచారం.. వైసీపీ ప్రభుత్వం మంచి లిక్కర్ పాలసీ తీసుకు రావాలని భావిస్తున్నట్టు మాత్రమే తనకు తెలుసని.. మిగతా విషయాలు తనకు తెలియదని సిట్ అధికారులకు చెప్పారట రాజ్కసిరెడ్డి.. అయితే, కేసులో లోతుగా విషయాలపై ఆరా తీద్దామనుకున్న సిట్ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా.. చుక్కలు చూపిస్తున్నారట నిందితులు..
వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీమోహన్కు మరోసారి కోర్టులో షాక్ తగిలింది.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియడంతో.. న్యాయమూర్తి ఎదుట వంశీ మోహన్ను హాజరుపరిచారు పోలీసులు.. అయితే, వల్లభనేని వంశీకి షాక్ ఇస్తూ.. మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. ఈ నెల 13వ తేదీతో వల్లభవేని వంశీ మోహన్ రిమాండ్ 90 రోజులు పూర్తి అవుతుందని పోలీసులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో వంశీ ఆ తర్వాత ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఇక, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయినా.. ఆ తర్వాత పలు కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉన్నా.. మిగతా కేసుల సంగతి ఏంటి? అనేది ఉత్కంఠగా మారింది.. అయితే, కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించడంతో.. వల్లభనేని వంశీ మోహన్ను కోర్టు నుంచి తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు..
రేవంత్ రెడ్డి మాటలు చూస్తే చేతకాని వాడు అని తేలిపోయింది..
తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నా వాస్తవాన్ని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన పాలనాపరమైన అనుభవ లేకపోయినదాని సూచనగా ఉందని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేసే అబద్ధాలుగా తేలిపోయాయని, తాము ఎప్పటి నుంచో ఢిల్లీ పార్టీలను నమ్మరాదని చెబుతున్నామని, రేవంత్ రెడ్డి మాటలు దివాలా కోరి వానిలా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారం ఉన్నప్పటికీ, పలు హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ప్రకారం, ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా NGOలు కీలకంగా కదం తొక్కాయి. వారి పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఉద్యమ నేతలకు గౌరవంగా ఉన్నత జీతాలు కల్పించామన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో భాగం కాలేదని, ఉద్యమ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బాలిక ప్రాణం తీసిన మెసేజ్ లు.. అసలు ఏం జరిగిందంటే?
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అసభ్యకర మెసేజ్ లు బాలిక ప్రాణాలు తీశాయి. రంగనాయకుల గుట్టకు చెందిన బాలిక మీనాక్షి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల విద్యార్ది రోహిత్ తన తమ్ముడి సోషల్ మీడియా అకౌంట్ నుంచి బాలికకు అసభ్యకర మెసేజ్ లు పంపించాడు. బాలికను వేధించసాగాడు. పోకిరి చేష్టలకు భయపడిపోయిన బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన వారు రెండు రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఓ రోజు రోహిత్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
మరోసారి హైడ్రా భారీ కూల్చేతలు.. ఈ సారి గచ్చిబౌలిలో
హైదరాబాద్ నగరంలో హైడ్రా బలగాలు మరోసారి భారీగా కూల్చివేతల దాడులు చేపట్టాయి. ఈ సారి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్ను లక్ష్యంగా చేసుకొని మినీ హాల్, ఫుడ్ కోర్ట్స్తో పాటు అనేక అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. ఉదయం నుంచే మూడు భారీ హిటాచ్ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో నిర్వహించబడ్డాయి. సంబంధిత లేఅవుట్కు ప్రభుత్వ అనుమతులు లేకుండానే రోడ్లు, పార్కులు వంటి ఉమ్మడి భూములపై ఆక్రమణలు జరిగాయని తెలుస్తోంది. రోడ్లను ఆక్రమించి నిర్మించిన గదులు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటి కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా పలువురు ప్లాట్ యజమానులు తమ స్థలాలు కనబడకుండా అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన వంటగదులు, రెస్ట్రూములు, మినీ హాల్ వంటి నిర్మాణాలన్నీ హైడ్రా అధికారుల పర్యవేక్షణలో కూల్చివేశారు. అంతేకాకుండా, జీ+2 అంతస్థుల్లో నిర్మించిన మూడు ఐరన్ షెడ్లు కూడా తొలగించబడ్డాయి. అదనంగా లేఅవుట్ను ఆక్రమించి వేసిన రేకుల ఫెన్సింగ్ను కూడా అధికారులు తొలగించారు. నగర శ్రేయస్సు కోసం, భవిష్యత్తులో ఇటువంటి అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శాసనానుగుణంగా మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పహల్గామ్ దాడి వెనుక లష్కరే.. పాకిస్తాన్ ను గట్టిగా మందలించిన యూఎన్ భద్రతా మండలి
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళన చెందిన పాకిస్తాన్ UNSC తో సమావేశం కావాలని అభ్యర్థించింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఒంటరి అయింది. ఈ సమావేశాన్ని పాకిస్తాన్ మరోసారి భారతదేశానికి వ్యతిరేకంగా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ఉపయోగించుకుంది. సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు పాకిస్తాన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పాకిస్తాన్ ‘ఫాల్స్ ఫ్లాగ్’ కథనాన్ని అంగీకరించడానికి ఐక్యరాజ్యసమితి నిరాకరించింది. పహల్గామ్ దాడిలో లష్కరే తోయిబా ప్రమేయం గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్ను ప్రశ్నించింది. ఈ సమావేశం ఉగ్రవాద దాడిని విస్తృతంగా ఖండించింది. జవాబుదారీతనం అవసరాన్ని గుర్తించింది. ముఖ్యంగా మత విశ్వాసం ఆధారంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకునే అంశాన్ని కూడా కొందరు సభ్యులు లేవనెత్తారు. ఈ సమావేశంలో, ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి.పాకిస్తాన్ క్షిపణి పరీక్షపై కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిని రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించాయి.
ఎట్టకేలకు హిట్ కొట్టింది.. కానీ వివాదంలో మరో సినిమా
తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశీ ఖన్నా కూడా తెలుగు, తమిళ్లో స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్లో హిట్స్ అందుకుంటే వాణి కపూర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లు ఐపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా ఫింగర్పై లెక్కించలేనన్నీ హిట్స్ అయితే లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టినా ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్ను డైలమాలో పడేశాయి. వరుస ప్లాపులు వాణి కెరీర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ చేయడంతో పాటు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. తమిళంలో నాని సరసన ఆహా కళ్యాణం చేస్తే బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టింది. ఇక అప్పటి నుండి సౌత్ మొహమే చూడలేదు అమ్మడు. బాలీవుడ్లోనే తాడో పేడో తేల్చుకుందామని ప్రిపేర్ అయ్యింది. చివరకు ఆమె ఫేట్ను మార్చేశాడు అజయ్ దేవగన్. రైడ్ 2లో ఇలియానా ప్లేసును గాయబ్ చేసిన వాణి ఖాతాలో ఎట్టకేలకు ఓ హిట్ పడింది. మే 1న రిలీజైన మూవీ రూ. 70 కోట్లను దాటి వంద కోట్లకు పరుగులు పెడుతోంది. రైడ్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. బాక్సాఫీస్ దగ్గర బొమ్మ హిట్ కొట్టడంతో ఆడియన్స్, క్రిటిక్స్, మీడియాకు థాంక్స్ చెప్పింది. అయితే రైడ్ 2తో హిట్ కొట్టింది అనుకుంటే. మరో సినిమా వివాదంలో నెలకొంది. మే 9న అబీర్ గులాల్ రిలీజ్ కావాల్సి ఉండగా పహల్గాం అటాక్ కారణంగా వివాదంలో చిక్కుకుంది. ఇందులో నటించిన హీరో పవాద్ ఖాన్ పాకిస్తాన్కు చెందిన నటుడు. దాంతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే అమ్మడి స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లడం ఖాయం.
మెట్ గాలాలో షారుఖ్ తీరు పై ఫ్యాన్స్ ఫైర్ ?
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో, ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా మెట్గాలా గ్రాండ్గా ప్రారంభమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ , కియారా అడ్వాణీ , ప్రియాంక చోప్రా, నిక్జొనాస్, సింగర్ దిల్జిత్ దోసాంజ్, నటాషా పూనావాలాతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమార్తె ఇషా అంబానీ, తదితరులు రెడ్ కార్పెట్పై సందడి చేశారు. ప్రతి ఒక్కరు విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇందులో ముఖ్యంగా బాద్షా డిఫరెంట్ లుక్లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ ఈ ఫోటోలపై ఖాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే.. షారుఖ్ ఖాన్ మొదటిసారి మెట్ గాలా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ నుండి SRK ఫోటోలు బయటకు వచ్చాయి, ఆయన లుక్ కి మిశ్రమ స్పందన వచ్చింది. SRK మేనేజర్ పూజా దదలానీ ఈ ఫోటోలను షేర్ చేశారు. అయితే ఇంత పెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఫోటోలు.. పూజా ఖాతా నుంచి షేర్ చేయడం ఏంటీ.. షారుఖ్ ఖాన్ షేర్ చేయాలి కానీ. అంటూ మండి పడుతున్నారు. ఆయన ధరించిన దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. పూర్తిగా బ్లాక్ డ్రెస్ లో ఆయన లేయర్డ్ నగలు ధరించారు, చేతిలో కర్ర, కళ్ళకు గాగుల్స్ ఉన్నాయి. కానీ షారుఖ్ ఖాన్ లుక్ చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఒక యూజర్ అయితే ‘సబ్యసాచి, నువ్వు ఆయన లుక్ ను కంప్లీట్ గా పాడు చేశావు’ అని, మరో యూజర్ ‘ఇది చూడటానికి నేను 3:30 వరకు మేల్కొని ఉన్నాను’ అని రాశారు. మొత్తానికి షారుక్ అభిమానులను కొంత నిరాషపరిచాడని చెప్పాలి.