సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ‘మళ్ళీ మొదలైంది’ మూవీని ఫిబ్రవరిలో ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేమికుల రోజు కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ 5 సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను హీరో సుమంత్ ట్వీట్ చేశారు. విడాకులు తీసుకున్న ఓ జంటకు సంబంధించిన కథ ఇది. చిత్రం ఏమంటే… హీరో విడాకుల కోసం ఓ లేడీ లాయర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెతోనే అతను ప్రేమలో పడతాడు. మొదట ఈ ప్రపోజల్ ను తిరస్కరించినా, ఆ తర్వాత ఆమె కూడా హీరోతో లవ్ లో పడుతుంది. అప్పటి వరకూ హీరో విడాకులు తీసుకుంటున్నాడని ఆడిపోసుకున్న వాళ్ళు, హేళన చేసిన బంధువులు… ఈ రెండో పెళ్లి విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారన్నదే సినిమా కథ.