నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కింది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్లు సంయుక్తంగా నిర్మించారు. 1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్లో నిర్మిస్తోన్న తొలి చిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో దీనిని తీశారు. మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్.
Read Also : భార్యలతో పాటు స్టార్స్ అంతా ఒకేచోట… పిక్ వైరల్
ఆయన మాట్లాడుతూ ‘‘అలీ గారు అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ని పెట్టి సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్ సౌండ్ బావుంది. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ దగ్గర అసిస్టెంట్గా చేసిన రాకేశ్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారట. అలీ,నరేశ్ గార్లతో పాటు టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. అలీ మాట్లాడుతూ ‘‘ప్రభాస్తో నేను ‘యోగి’, ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’,‘ బిల్లా’, ‘రెబల్’ ఇలా అనేక చిత్రాల్లో నటించిన పరిచయంతో మా సినిమా మొదటి సాంగ్ రిలీజ్ చేయాలి అని అడిగాను. ప్రభాస్ ఇండియాలో లేనప్పటికి నా మీద అభిమానంతో మా సినిమా గురించి మాట్లాడుతూ వీడియో చేసి పంపించారు. మా ‘అందరూ బావుండాలి…’ సినిమా ప్రమోషన్ను ప్రభాస్తో ప్రారంభించటం ఆనందంగా ఉంది. మా సినిమా మొదటి పాట లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలవుతుంది. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. పరిస్థితులు చక్కదిద్దుకోగానే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రంలో శివబాలాజీ, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, శివారెడ్డి, సప్తగిరి, పృధ్వీ, రామ్జగన్, భద్రం, లాస్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.