తెలంగాణలో పాదయాత్రల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రతో మరోసారి పాదయాత్రలు తెరమీదకు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఆ తరువాత 2014లో వైసీపీ ఏపీలో చురుగ్గా మారింది. ఇక 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేపట్టారు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా గతంలో పాదయాత్ర చేశారు. ఈనెల 24 నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు.
Read: “బ్లాక్” టీజర్… ఆది సాయికుమార్ మరో థ్రిల్లర్
నెల రోజుల క్రితం వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 2021 అక్టోబర్ 18 వ తేదీ నుంచి ఆమె పాదయాత్ర చేపట్టబోతున్నారని సమాచారం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, రాజన్న రాజ్యం తిరిగి తెలంగాణలో తీసుకొస్తామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అక్టోబర్ 18 నుంచి ప్రారంభించబోయే సుదీర్ఘ యాత్రలో అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తారు, ఎలాంటి పాలన అందిస్తారు తదితర విషయాలను ఈ యాత్రలో ప్రజలకు వివరిస్తారని సమాచారం. 2021 అక్టోబర్ 18 న చేవెళ్ల నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం.