తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హైదరాబాద్ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. విధి విధానాలు ప్రకటించారు. అక్కడే ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే తాను పార్టీ పెట్టినట్లు చెప్పారు. సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమమే.. తమ పార్టీ సిద్ధంతామన్నారు షర్మిల. రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం పోలేదని… పేదరికం నుంచి కేసీఆర్ కుటుంబం మాత్రమే బయటపడిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.
జల వివాదంలో ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు షర్మిల. రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే ఇప్పుడే సీఎం కేసీఆర్ మేల్లొన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నాయంటున్న బీజేపీ.. ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు షర్మిల. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ తోడుదొంగలే అన్న ఆమె.. కాంగ్రెస్కు వైఎస్ఆర్ పేరును ఉచ్చరించే అర్హత లేదన్నారు.సరిగ్గా వందరోజుల్లో రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెడతానని ప్రకటించారు.