Site icon NTV Telugu

తెలంగాణ‌కు మొండి చేయి.. బీజేపీ ఎంపీలు విఫ‌లం..!

కేంద్ర బ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌.. గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపించింద‌ని ఫైర్ అయ్యారు.. ఇక‌, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణ‌కు నిధులు తీసుకురావడంలో విఫ‌లం అయ్యార‌ని ఆరోపించారు.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప అందులో ఏం లేద‌ని దుయ్య‌బ‌ట్టిన ఆమె.. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే లేద‌న్న ఆమె.. తెలంగాణ‌కు మొండి చేయి ఇచ్చి.. ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్ లో అధిక ప్రాధాన్య‌త ఇచ్చార‌ని మండిప‌డ్డారు..

Read Also: ఏపీలో 40 చోట్ల సీబీఐ సోదాలు

ఇక‌, కేంద్ర బ‌డ్జెట్‌లో పేర్కొన్న పీఎం డిజిటల్ విద్య కోసం 200 ఛానెల్స్ ఏర్పాటు విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఆమె.. గత బడ్జెట్‌లో చెప్పిన 100 సైనిక్ స్కూల్స్, 750 ఏకలవ్య మోడల్ స్కూల్స్ లలో ఎన్ని ఏర్పాటు చేశారో..? చెప్పాల‌ని.. వాటిలో ఎన్ని నడుస్తున్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డిమాండ్ చేశారు వైఎస్ ష‌ర్మిల‌.. మ‌రోవైపు, టాక్స్ స్లాబ్స్‌లో ఎటువంటి మార్పులు చేయకపోవడం మధ్యతరగతి వారిని తీవ్ర నిరాశకు గురిచేసింద‌న్న ఆమె… రైతులకు మద్దతు ధర అంశం ఊసెత్తనేలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. అరకొర నిధులు కేటాయిస్తూ న‌రేంద్ర మోడీ స‌ర్కార్.. పేదల ప్రజల సొంతింటి కలకు కూడా తూట్లు పొడిచింద‌ని ఆరోపించారు ష‌ర్మిల‌.

Exit mobile version