తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయం భక్తులకు దర్శనమిచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువు ప్రారంభమైంది. విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యహ వాచన మంత్రాలతో స్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేశారు. బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా వెదురు కర్రలతో యాగశాలను నిర్మించారు.
అయితే మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామి వారికి అభిషేకానికి కాళేశ్వరం గోదావరి జలాలను వినియోగించారు. కాళేశ్వరం 15వ ప్యాకేజీలో నిర్మించిన ఆఫ్టేక్ 2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికారు. గోదావరి శుద్ధ జలాలను రాగి చెంబుతో తీసుకువచ్చి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.