నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల పాఠశాలలో వాచ్ మెన్ వెంకటేష్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావికి చెందిన వెంకటేష్ లింగాల గురుకుల పాఠశాలలో గత 13 సంవత్సరాల నుండి ఔట్ సోర్సింగ్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది క్రితం పాఠశాలకు వచ్చిన సూపరింటెండెంట్ సింగయ్య గత కొంత కాలం నుండి ఉద్యోగపరంగా వెంకటేష్ ను వేధింపులకు గురి చేస్తున్నట్లు మృతుని బంధువులు ఆరోపించారు.
ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ ఇద్దరూ కలిసి మృతునికి సరెండర్ నోటీస్ తయారుచేసి సంతకం పెట్టమని వెంకటేష్ పై ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్థాపానికి గురై తాను నివాసం ఉంటున్న పాఠశాలలోని భవనంలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురుకుల పాఠశాలలో వాచ్ మెన్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్న వార్త తెలుసుకున్న వెంకటేశ్వర బావికి చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో లింగాలకు తరలివచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు, గ్రామస్తులు సూపరింటెండెంట్ కోసం పాఠశాల గదులను వెతుకుతూ ఫర్నిచర్ ను పాక్షికంగా ధ్వంసం చేశారు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న జీపును అడ్డుకొని బంధువులు రోడ్డుకి అడ్డంగా పడుకున్నారు..సూపరింటెండెంట్ సంఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేస్తూ ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నాను ముట్టడించారు.
మృతుడి భార్య, తల్లి తమకు న్యాయం చేయాలని పాఠశాల భవనం పైకి ఎక్కి కిందికి దూకే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు..పాఠశాలలో పరిస్థితులు జటిలం అవుతూ ఉండడంతో పోలీసులు భారీ సంఖ్యలో సంఘటన స్థలంలో మోహరించి పరిస్థితులను అదుపు చేశారు. లింగాల గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వాచ్ మెన్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ, బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జ్ నాగార్జున ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, మృతికి కారకులైన ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడినే నిలిచిపోయాయి.
గురుకుల పాఠశాలలకు చెందిన వాచ్ మెన్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఆర్ సి ఓ వనజ హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు..సెల్ ఫోన్ ద్వారా గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తో మాట్లాడి పరిస్థితిని వివరించారు..కార్యదర్శికి నివేదిక సమర్పించడం జరుగుతుందని, ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై మృతుని భార్య జోత్స్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.