Site icon NTV Telugu

Vijayashanti: కేసీఆర్‌ పక్కా హిందూ వ్యతిరేకి..! కేవలం వాటికోసమే యాగాలు..!

భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్‌ మీడియాలో స్పీడ్‌ పెంచారు విజయశాంతి.. ముఖ్యంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ.. ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనకు సీఎం కేసీఆర్‌ హాజరుకాకపోవడంపై, కేంద్ర బడ్జెట్‌ తర్వాత సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంపై ట్విట్టర్‌ వేదికగా ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు రాములమ్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుతో ఆయన పక్కా హిందూ వ్యతిరేకి అనే విషయం అడుగడుగునా స్పష్టమవుతోందని.. తాజాగా కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ కేవలం బీజేపీని తిట్టిపోసేందుకే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో… టీఆర్‌ఎస్‌ సయామీ కవల పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒక వెలుగు వెలగాలని పదే పదే కోరుకున్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ని తమ సోదరుడని చెబుతూ… ఎంఐఎంని ఉద్దేశించి అసంకల్పితంగా ‘హమారా పార్టీ హై’… అని కూడా అనేశారని మండిపడ్డారు.

Read Also: Talasani Srinivas Yadav: తలసాని సంచలనం.. ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపే కుట్ర..!

నా సోదరుడిని (అసదుద్దీన్) జాతీయ రాజకీయాల్లో మెరవనివ్వండి… తప్పేంటి? అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందించారు. కానీ, ఇదే అసదుద్దీన్, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ గతంలో ఎన్నిసార్లు హిందువులను ఉద్దేశించి… చులకనగా వ్యాఖ్యలు చేసి అవమానించారో… హెచ్చరించారో… బెదిరింపులకు పాల్పడ్డారో ఒక్కసారి యూట్యూబ్‌లో వారి పాత వీడియోలు చూస్తే అర్థమవుతుంది. 15 నిమిషాలు పోలీసుల్ని పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువులకు వారి చోటేమిటో… చూపిస్తామని వ్యాఖ్యానించింది ఎవరు?… మొన్నటికి మొన్న యూపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ… మోడీ, యోగి ఆ పదవుల నుంచి తప్పుకుంటే అప్పుడు మీ గతేంటో చూసుకోండి, మేం మర్చిపోం… అని యూపీ పోలీసులకి, అధికారులకి హెచ్చరికలు జారీ చేశారు. ఇదీ టీఆర్‌ఎస్‌ సయామీ కవల పార్టీ అయిన ఎంఐఎం అధినేత, ఆ పార్టీ నేతల తీరు. ఇలా ఎన్నో సార్లు ఎంఐఎం నేతలు హిందువులకు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినా పట్టనట్టు వ్యవహరిస్తూ.. చేతగాని దద్దమ్మలా పడి ఉండటమే గాక వారికి మద్దతు పలుకుతున్న సీఎం కేసీఆర్‌ని హిందూ వ్యతిరేకి గాక మరేమనాలి? అని ప్రశ్నించారు. చివరికి యాదాద్రి ఆలయాన్ని కూడా వ్యక్తిగత ప్రచారానికి వాడుకుని తమ శిల్పాలు కూడా చెక్కించుకున్నారని ఎద్దేవా చేసిన రాములమ్మ.. అందరూ ఛీ కొట్టాక వాటిని తొలగించారు. తాజాగా సమతామూర్తి రామానుజుల విగ్రహావిష్కరణకు హైదరాబాద్ విచ్చేసిన ప్రధానమంత్రిగారి కార్యక్రమానికి కావాలనే డుమ్మా కొట్టి ఒంట్లో బాగా లోదని అధికారులతో చెప్పించారని దుయ్యబట్టారు.. కేసీఆర్ చేసే యాగాలు, పూజలు కేవలం హిందువుల ఓట్ల కోసమేనని ప్రజలకు బాగా తెలుసు… అలాగే… మిమ్మల్ని గద్దె దించి ఇంటికి ఎలా పరిమితం చెయ్యాలో కూడా వారికి బాగా తెలుసు అని వరుస ట్వీట్లు వేశారు విజయశాంతి.

https://twitter.com/vijayashanthi_m/status/1491253668662120450
Exit mobile version