NTV Telugu Site icon

కేసీఆర్‌కు ఒక్కటే హెచ్చరిక.. రాముల‌మ్మ వార్నింగ్

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్‌పై మ‌రోసారి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు బీజేపీ నేత‌, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అలియాస్ రాముల‌మ్మ‌.. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై దాడిని ఊటంకిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలంగాణ స‌ర్కార్‌పై మండిప‌డ్డారు.. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్… రాజకీయంగా ఎదురించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆమె.. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గుండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను… కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం చేస్తుంటే… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అనే సందేహం కలుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఒక పార్లమెంట్ సభ్యుడికి రక్షణ కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత… లేకుంటే ఎంత? అని ప్ర‌శ్నించిన రాముల‌మ్మ‌,. రాష్ట్రంలో నానాటికీ టీఆర్ఎస్ గుండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేద‌ని ఆరోపించారు… పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్న ఈ దగాకోరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక్కటే హెచ్చరిక దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే… వెన్నుచూపే ప్రసక్తే లేదు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన మా పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉంద‌ని గుర్తుచేశారు. మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ…. మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం అని హెచ్చ‌రించారు విజ‌య‌శాంతి.