తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి… రైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించాలని తన లేఖలో పేర్కొన్నారు.. కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బందితో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే. భారతీయ రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా ముఖ్యమైన నిత్యావసర వస్తువులైన ఆహార ధాన్యాలు, పాలు, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఎరువులు, మందులు, బొగ్గు, సిమెంటు ఇంకా పరిశ్రమలకు కావలసిన ముడిపదార్థాలను సరఫరా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కి సంబంధించిన అత్యవసర సామగ్రి పరికరాల సరఫరాలో కూడా రైల్వేశాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు కిషన్రెడ్డి.
ఆక్సిజన్ కి సంబంధించి ప్రత్యేక రైళ్లను నడపడంలో కావచ్చు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ప్రత్యేకంగా నడిపిన శ్రామిక్ రైళ్ల విషయంలో కావచ్చు .. రైల్వే శాఖ ఉద్యోగులు కోవిడ్ కష్టకాలంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా పని చేస్తున్నారన్నారు కిషన్రెడ్డి.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రైల్వే ఉద్యోగులు కూడా కోవిడ్ బారిన పడటం లేదా తమకు తెలియకుండానే కోవిడ్ వ్యాప్తికి కారణం అయ్యే పరిస్థితులు ఉన్నాయని.. ఈ విషయాన్ని గమనించి ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వటానికి ఆదేశాలు కూడా జారీ చేశాయని.. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే కూడా రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఇదివరకే పలుమార్లు విజ్ఞప్తి చేసిందని.. కాబట్టి, రైల్వే ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణాలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులను కూడా ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వారికి ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందితో సమానంగా వ్యాక్సినేషన్ తదితర సదుపాయాలు అందుబాటు లోకి వచ్చేలా తమరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి.