దేశవ్యాప్తంగా విద్యుత్కు భారీగా డిమాండ్ పెరిగిన తరుణంలో.. బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై ప్రకటన విడుదల చేసింది. కోల్మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్టు-2015, మైన్స్, మినరల్స్ యాక్టు-1957 ప్రకారం వేలం వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని బ్లాకులతో పాటు తెలంగాణకు చెందిన నాలుగు గనులు వీటిలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం బ్లాక్-3, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్-3, మంచిర్యాల జిల్లా కల్యాణఖని బ్లాక్-6, శ్రావణపల్లిలోని మరో బ్లాక్ వేలం వేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సోమవరం వెస్ట్ బ్లాకు కూడా జాబితాలో ఉంది.
బొగ్గు లభ్యతపై అన్వేషణ కోసం సింగరేణి ఇప్పటివరకు సత్తుపల్లి బ్లాక్-3లో 8 కోట్లు, కోయగూడెం ఓసీ-3లో 18 కోట్లు, శ్రావణపల్లిలో 20 కోట్లు, మంచిర్యాల కేకే-6లో 20 కోట్లు ఖర్చు చేసింది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తూ వచ్చింది. సాలీనా 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తోంది.. కానీ, ఈ బ్లాకులు సింగరేణి లీజు పరిధిలో లేవు. ఇదే కారణంతో వేలంలో చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సంస్థ ప్రైవేట్ కంపెనీలతో పోటీపడి బ్లాకులను దక్కించుకోవాల్సి ఉంది. అన్వేషణ కోసం ఇప్పటివరకు చేసిన వ్యయాన్ని వేలం దక్కించున్న సంస్థల నుంచి తిరిగి రాబట్టుకునే అవకాశముండటం కాస్త ఊరటనిచ్చే విషయం. అయితే, కేంద్రం నిర్ణయం కోల్బెల్ట్లో చర్చనీయాంశంగా మారింది.
