KTR : బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

  • హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికైన ఉదయ్ నాగరాజు
  • ఢిల్లీలో శాలువా, సిల్వర్ ఫిలిగ్రీతో కేటీఆర్ సత్కారం
  • భారత్-యూకే సంబంధాల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష
  • కేటీఆర్ రాజకీయ ప్రస్థానం తనకు స్ఫూర్తి అన్న ఉదయ్ నాగరాజు
Ktr Uday Nagaraj

Ktr Uday Nagaraj

KTR : తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు, తొలిసారిగా బ్రిటన్ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ కు ఎంపికైన తెలుగు బిడ్డ ఉదయ్ నాగరాజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సత్కరించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రత్యేక అభినందన సభలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై కేటీఆర్, ఉదయ్ నాగరాజును శాలువాతో సత్కరించి, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ మాస్టర్ పీస్ అందజేసి తమ శుభాకాంక్షలు తెలిపారు.

భారత్-యూకే సంబంధాల్లో ఉదయ్ పాత్ర కీలకం: కేటీఆర్

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికైన ఉదయ్ నాగరాజుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత రెండు దశాబ్దాలకు పైగా భారత్, బ్రిటన్‌ల మధ్య వివిధ రంగాల్లో సంబంధాల బలోపేతానికి ఉదయ్ నాగరాజు విశేష కృషి చేశారని కొనియాడారు. యూకే పౌరుడిగా అక్కడి స్థానిక రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఎదిగి, అత్యున్నత సభ సభ్యుడిగా ఎంపిక కావడం ఆయన పట్టుదల, సేవా నిరతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తెలంగాణలో వాణిజ్యం, పెట్టుబడులు, సేవారంగాల పురోగతికి కూడా ఉదయ్ నాగరాజు తోడ్పడాలని ఆకాంక్షించారు.

కేటీఆర్ రాజకీయ ప్రయాణమే నాకు స్ఫూర్తి

సన్మానం అందుకున్న అనంతరం ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేసుకున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసి, మంచి ఉద్యోగాన్ని వదులుకుని స్వరాష్ట్రం కోసం భారత్‌కు తిరిగివచ్చిన కేటీఆర్ రాజకీయ ప్రయాణం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా, అంతర్జాతీయ గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన కేటీఆర్ తీరు.. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే సమాజంలో గొప్ప మార్పు తేవచ్చనే నమ్మకాన్ని కలిగించిందన్నారు. సమకాలీన రాజకీయాలు, పెట్టుబడుల సాధనపై కేటీఆర్‌కు ఉన్న దూరదృష్టి అభినందనీయమని చెబుతూ, ఈ కార్యక్రమానికి వచ్చి తనను అభినందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రముఖుల సమక్షంలో ఘనంగా వేడుక

న్యూఢిల్లీలో జరిగిన ఈ అభినందన సభలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురు రాజకీయ ప్రముఖుల మధ్య ఈ వేడుక ఎంతో ఉత్సాహంగా జరిగింది.