సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. కేటుగాళ్ల వలలో చిక్కి ప్రజలు లక్షలు మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు తాజాగా రెండు చోటు చేసుకున్నాయి. ఎస్బీఐ అకౌంట్కు చెందిన కేవైసీ అప్డేట్ చేయాలంటూ.. బ్యాంకు అధికారిగా ఓ మహిళకు కేటుగాళ్లు ఫోన్ చేశారు. కేవైసీ అప్డేట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని సదరు మహిళను చీటర్స్ భయపెట్టారు. దీంతో నిజమని నమ్మిన ఆ మహిళ బ్యాంకు వివరాలన్నీ చెప్పి, మొబైల్ కు వచ్చిన ఓటీపీ కూడా చెప్పింది.
అది చెప్పిన క్షణాల వ్యవధితో అకౌంట్లో నుంచి రూ.15లక్షలు కేటుగాళ్లు కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. ఇదిలా ఉంటే.. స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు పొందవచ్చని, ఓ మహిళకు ఆన్లైన్ లో పరిచయమైన వ్యక్తి స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ మహిళతో 7లక్షలు పెట్టుబడిగా పెట్టించి ఆ మొత్తాన్ని కాజేశాడు. లాభాలను చూసుకునేందుకు ప్రయత్నించగా..ఆ మహిళ మోసపోయానని తేరుకుంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.