CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!

  • తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
  • ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఫోకస్
  • బ్యారేజ్ ఎత్తు పెంపుతో లక్షల ఎకరాలకు సాగునీరు?
  • గ్రావిటీ ద్వారా నీటి తరలింపుపై తెలంగాణ లెక్కలు
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ‘తుమ్మిడిహెట్టి బ్యారేజ్’ నిర్మాణం , దాని ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారికంగా ఒక లేఖ రాశారు. ఈ బ్యారేజ్ అంశంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రతినిధుల బృందంతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అందుకు అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో కోరారు.

గతంలో (2016 ఆగస్టు 23న) జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు (Inter-State Board) సమావేశంలో తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో (FRL) బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అవసరమైన అన్ని అనుమతులకు సహకరిస్తామని కూడా అప్పట్లో తెలిపింది. అయితే, నిలిచిపోయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్.. ఇటీవల ఈ ప్రాజెక్టుపై సమగ్రంగా పునఃసమీక్ష నిర్వహించింది.

ఎత్తు పెంచితేనే తెలంగాణకు ప్రయోజనం.. ముంపు చాలా తక్కువ!
ఇంజనీరింగ్ నిపుణుల సూచనల ప్రకారం.. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల నీటి అవసరాలను పూర్తిగా తీర్చడం సాధ్యం కాదని రేవంత్ సర్కార్ ఒక అంచనాకు వచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలను, ప్రజల తాగునీటి గోసను తీర్చాలంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రతో మరోసారి చర్చలు జరపడం అనివార్యమని సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.

ఒకవేళ బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల కంటే కాస్త పెంచినప్పటికీ, మహారాష్ట్ర వైపు జరిగే ముంపు ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని రేవంత్ రెడ్డి ఆ లేఖలో సాంకేతికంగా వివరించారు. ఎఫ్ఆర్ఎల్ (FRL) ఎత్తును పెంచడం ద్వారా అదనపు పంపింగ్ ఖర్చులు లేకుండా, కేవలం గ్రావిటీ (సహజ ప్రవాహం) ద్వారానే తెలంగాణలోని బీడు భూములకు సులభంగా నీటిని తరలించే వీలుంటుందని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.