కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లిలో పర్యటించారు. మంత్రి మాల్లారెడ్డితో కలిసి మూడు చింతలపల్లిలో రూ.15 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం, 13.5 లక్షలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రహరీ నిర్మాణానికి శకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లే లాభ పడ్డారు. చేతగాని దద్దమ్మలు అని ఘాటుగా విమర్శించారు. తుపాకీ వెంకట్రాముడు లాగా మాట్లాడుతారు. వీళ్ల పాలనలో రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిందన్నారు. గ్రామాల్లో కనీస వసతులు లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ వచ్చాక గ్రామాలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రతి గ్రామానికి నిధులు అందే విధంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 230 కోట్లు ఇస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ నీళ్లు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు వచ్చాయి. గతంలో మనం ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. పల్లెలు పరిశుభ్రంగా మారి అభివృద్ధిని సాధించాయన్నారు. పల్లె ప్రగతిని కొనసాగించి మన పల్లెలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
Srinivas Goud: రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి