Telangana Women Commission : తెలంగాణ రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణ, భద్రత , సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర మహిళా కమిషన్కు కొత్త కార్యవర్గాన్ని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకాల్లో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సామాజిక సేవ , మహిళా హక్కుల కోసం పోరాడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం ద్వారా ప్రభుత్వం ఉద్యమ కుటుంబాలకు సముచిత గౌరవాన్ని కల్పించింది. శ్రీకాంతచారి త్యాగం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన నేపథ్యంలో, ఆయన తల్లికి ఈ పదవిని కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు, తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వారసత్వాన్ని గౌరవిస్తూ ఆమె మనవరాలు చిట్యాల శ్వేతను కూడా కమిషన్ సభ్యురాలిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఐలమ్మ కుటుంబానికి ఈ నియామకంతో సముచిత గుర్తింపు లభించింది. వీరితో పాటు వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి , ఉజ్మా షకీరాలను కూడా సభ్యులుగా నియమించారు. సామాజిక సేవలో చురుగ్గా ఉంటూ మహిళా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడం ద్వారా కమిషన్ పనితీరు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఈ కొత్త కమిషన్ మహిళలపై జరిగే అన్యాయాలు, వేధింపులు , వివక్షత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. క్షేత్రస్థాయిలో మహిళా భద్రతను పర్యవేక్షించడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన మహిళలకు సకాలంలో అందేలా చూడటంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా, త్యాగధనుల కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ నియామకాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొత్త కమిషన్ ఆధ్వర్యంలో మహిళల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని , రాష్ట్రంలో మహిళా హక్కుల పోరాటం సరికొత్త పుంతలు తొక్కుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
