Extends Working Hours : తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అధిక రద్దీ ఉన్న చంపాపేట్, సరూర్నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్నగర్, షాద్నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్కేసర్, నల్గొండ ఆర్.ఓ, పటాన్చెరు , కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి పని వేళలను పొడిగించారు. ఈ 15 కార్యాలయాలు ఇకపై ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పని చేస్తాయని, అవసరమైతే సమయాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, వేగం , ప్రజలకు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్లాట్ బుకింగ్ల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రద్దీని బట్టి అదనపు సమయాన్ని కేటాయించాలని సూచించారు. అలాగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహసీల్దార్ కార్యాలయాలతో కూడా సమన్వయం చేసుకోవాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతును ఆదేశించారు. ఈ కొత్త మార్పులతో భూముల ధరల సవరణ సమయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
