Good News : తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు విద్యా రంగానికి సంబంధించిన సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా , సులభంగా అందించేందుకు ‘వాట్సాప్ (WhatsApp) ద్వారా పాఠశాల విద్యా సేవలను’ అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఈ నూతన వాట్సాప్ సేవలను తెలంగాణ గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. డిజిటల్ గవర్నెన్స్ (డిజిటల్ పరిపాలన) దిశగా, పౌర కేంద్రీకృత సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక వాట్సాప్ ప్లాట్ఫారమ్ను తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (ITE&C) శాఖకు చెందిన ‘ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) – మీసేవ’ విభాగం, పాఠశాల విద్యా శాఖతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా తమ వాట్సాప్ మొబైల్స్ ద్వారానే పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్, కీలక సమాచారాన్ని అందుకోనున్నారు. విద్యార్థుల అకడమిక్ ప్రగతి, విద్యా సామాగ్రి పంపిణీ, స్కాలర్షిప్లు, పరీక్షలు, పాఠశాల ఈవెంట్స్, ఆరోగ్య కార్యక్రమాలు వంటి వివరాలన్నీ ఈ ప్లాట్ఫారమ్ ద్వారా ఎప్పటికప్పుడు చేరవేస్తారు.
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన డిజిటల్ సేవలు
గడిచిన కాలంలో ప్రయోగాత్మకంగా సాగిన ఈ డిజిటల్ సేవల ద్వారా ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయోజనం పొందారు. ప్రస్తుతం ఈ వాట్సాప్ సేవ ద్వారా విద్యార్థుల ప్రగతి నివేదికలు (Progress Reports), హాల్ టికెట్ల డౌన్లోడ్, మార్కుల మెమోలు , పరీక్షల ఫలితాలను సులభంగా పొందవచ్చు. వీటితో పాటు దాదాపు 83,000 వరకు ఉన్న పాత ఎస్ఎస్సీ (SSC) మెమోలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, బదిలీ సర్టిఫికెట్లు (TC) డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఎస్ఎస్సీ మెమో సవరణ అభ్యర్థనలను కూడా వాట్సాప్ ద్వారానే సమర్పించవచ్చు. ఈ సేవల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పడమే కాకుండా, పేపర్వర్క్ కూడా భారీగా తగ్గింది.
త్వరలో రాబోతున్న మరిన్ని కొత్త ఫీచర్లు
ఈ ప్రాజెక్ట్ తదుపరి దశలో భాగంగా మరికొన్ని అదనపు సేవలను వాట్సాప్ ద్వారా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులు , తల్లిదండ్రుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అలాగే స్కూల్ యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కుల పంపిణీ వివరాలు, విద్యార్థుల రోజువారీ హాజరు (Attendance) సమాచారం, ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల అప్డేట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం (Mid-day Meal) వివరాలు, పాఠశాలల్లో నిర్వహించే క్రీడలు, పాఠ్యేతర కార్యకలాపాలు , రెసిడెన్షియల్ స్కూల్ సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని కూడా దీనికి అనుసంధానించనున్నారు.
ఆకట్టుకోనున్న ఫ్రెండ్లీ మస్కట్ ‘పాలపిట్ట’
ఈ వాట్సాప్ ప్రచారంలో సమాచార మార్పిడిని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఒక వినూత్న ఆకర్షణను జోడించారు. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ‘పాలపిట్ట’ (Indian Roller)ను ఒక ఫ్రెండ్లీ మస్కట్గా పరిచయం చేశారు. ఈ పాలపిట్ట డిజిటల్ రూపంలో ఆకట్టుకునే వీడియో సందేశాల ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని, ముఖ్యమైన అప్డేట్స్ను విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత సులభంగా, ఇంటరాక్టివ్గా , అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించనుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగంలో మెరుగైన ఫలితాలను సాధించడానికి , విద్యార్థులు, తల్లిదండ్రులతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమర్థవంతమైన, ప్రజలకు అనుకూలమైన పాలన అందించడంలో తెలంగాణ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, ఈ కార్యక్రమం రాష్ట్ర డిజిటల్ పరివర్తనలో మరొక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

