కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన విద్యాసంస్థలు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్నాయి.. అయితే, పాఠశాల స్థాయిలో ప్రత్యక్ష బోధనకు స్కూళ్లను, విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని పేర్కొంది.. కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇక, ఎవరికన్న కోవిడ్ నిర్ధారణ అయితే వారితో కాంటాక్ట్ ఉన్న వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించింది పాఠశాల విద్యాశాఖ.. విద్యార్థులు ఇంటి వద్ద ఉండి చదువుకుంటామంటే అనుమతి ఇవ్వాలని పేర్కొంది. స్కూల్స్ కి హాజరు కావాలని ఒత్తిడి చేయకూడదన్న సర్కార్.. మధ్యాహ్న భోజన సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కోవిడ్ బారినపడి మరణించిన వారి పిల్లలను ఏ కారణం చేత కూడా ప్రైవేట్ పాఠశాలల నుండి తీసివేయకూడదు అని ఆదేశాలు జారీ చేసింది పాఠశాల విద్యాశాఖ. కాగా, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది.. కానీ, ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం తరగతులు ఆన్లైన్లో నిర్వహించాలా? ప్రత్యక్షంగానా? అనేది ఆయా విద్యాసంస్థలు, విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నట్టు గతంలోనే స్పష్టం చేసింది సర్కార్.. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను కోర్టు ఆదేశాల మేరకు మరికొంత కాలం మూసి ఉంచుతున్నట్టు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సమాంతరంగా ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు ఏ విధానంలోనైనా తరగతులకు హాజరుకావొచ్చు అని గతంలోనే తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.