Telangana Rythu Bharosa First Phase Funds to Be Released on March 22 : తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా మొదటి విడత నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. నిధుల విడుదల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Mamata Banerjee: ఎలక్షన్ షెడ్యూల్ ముందు.. హిందూ, ముస్లిం ఓట్ల కోసం మమతా కీలక నిర్ణయం..
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా మూడు విడతల్లో నిధులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మొదటి విడతగా ఈ నెల 22న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు ఉన్న భూమికి సంబంధించి రూ. 3,590 కోట్లను బదిలీ చేయనున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు లభించనుంది. మొదటి విడత పూర్తయిన 20 రోజుల వ్యవధిలోనే రెండో విడత కింద మరో రూ. 2,650 కోట్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులను కూడా విడుదల చేసి, పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మొత్తంగా ఈ మూడు విడతల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి సుమారు రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందుతుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. నర్మెట్టలో జరిగే బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటంతో సిద్దిపేట జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ భారీ ఆర్థిక భరోసా కల్పిస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
