Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్

  • రూ.13,000 కోట్లతో భారీ రోడ్ల ప్రాజెక్టు
  • 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారుల అభివృద్ధి
  • రూ.338 కోట్లతో 14 కొత్త రోడ్లకు శంకుస్థాపన
  • యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి
Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్‌ను “నా భూతో న భవిష్యత్” అన్న రీతిలో అత్యద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలతో తనకు ప్రత్యేకమైన, వెలకట్టలేని అనుబంధం ఉందని.. గతంలో ప్రజలు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి తనను ఎంపీగా గెలిపించారని ఆయన కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే రోడ్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శ్రీకారం చుట్టామని మంత్రి స్పష్టం చేశారు.

రూ. 13,000 కోట్లతో చారిత్రక రోడ్ల ప్రాజెక్టు

రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోందని మంత్రి వివరించారు. మొత్తం రూ. 13,000 కోట్ల భారీ వ్యయంతో, 34 ప్యాకేజీల కింద, 6,092 కిలోమీటర్ల మేర విస్తరించిన 441 రోడ్లను హ్యామ్ (HAM – Hybrid Annuity Model) విధానంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నల్లగొండ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించుకున్నామని ఆయన గుర్తుచేశారు. ప్రమాదాలు లేని క్వాలిటీ రోడ్లుగా వీటిని తీర్చిదిద్దుతామని, రోడ్లు రద్దీగా ఉండే హైదరాబాద్ రూరల్ సర్కిల్ 1 & 2 ప్యాకేజీల్లోనే దాదాపు 30 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

రూ. 338 కోట్లతో 14 రోడ్లకు శంకుస్థాపన

అభివృద్ధి పనుల్లో భాగంగా తాజాగా రూ. 338 కోట్ల వ్యయంతో 149 కిలోమీటర్ల మేర విస్తరించే 14 రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో నాలుగు లేన్ల (4-Lane) రహదారుల నిర్మాణం ఒక చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, ఈ ప్రాంత ప్రజల మనిషిగా అద్దం లాంటి రహదారులను నిర్మించి తీరుతామని.. ఈ రోడ్ల కనెక్టివిటీ ద్వారా రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని మంత్రి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు.