Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన

  • పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వ క్లారిటీ
  • పానిక్ బాయింగ్‌తో పెరిగిన డిమాండ్
  • భారీగా పెంచిన ఇంధన సరఫరా
  • వదంతులు నమ్మొద్దు.. ప్రభుత్వ భరోసా
Ap Petrol Supply

Ap Petrol Supply

Telangana Govt Clarifies Petrol and Diesel Supply Situation Amid Shortage Rumors: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా పెట్రోల్ , డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంపై పౌరసరఫరాల శాఖ స్పందిస్తూ వినియోగదారులకు స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఇంధన డిమాండ్ అకస్మాత్తుగా పెరగడానికి అనేక భౌగోళిక , ఆర్థిక కారణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధనం నిండుకోవడంతో (Dry-outs), ఆ ప్రభావం ఖమ్మం , మిర్యాలగూడ వంటి సరిహద్దు జిల్లాలపై పడింది. ఇదే తరహా పరిస్థితి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిర్మల్ జిల్లాలో కూడా తలెత్తింది. ఈ వార్తలు మీడియాలో విస్తృతంగా రావడంతో ప్రజల్లో భయాందోళనలు (Panic buying) మొదలై రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఇంధన డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది.

ఈ పరిస్థితికి మరో ప్రధాన కారణం పారిశ్రామిక , రిటైల్ ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. పారిశ్రామిక , వాణిజ్య అవసరాలకు వాడే డీజిల్ ధర ఏప్రిల్ 16, 2026 నాటి సవరణ ప్రకారం లీటరుకు రూ. 150 ఉండగా, రిటైల్ బంకుల్లో మాత్రం రూ. 95 కే లభిస్తోంది. ఈ రూ. 55 వ్యత్యాసం వల్ల వాణిజ్య వినియోగదారులు పెద్ద ఎత్తున రిటైల్ బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు వేగంగా తగ్గిపోయాయి. దీనికి తోడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వదంతులు రావడంతో ప్రజలు ముందుగానే ఇంధనాన్ని అధిక మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏప్రిల్ 25 నుంచి చమురు సంస్థలతో (OMCs) సమన్వయం చేసుకుంటూ సరఫరాను ముమ్మరం చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన సరఫరా సాధారణం కంటే ఎంతో ఎక్కువగా జరుగుతోంది. ఏప్రిల్ 29 నాటికి అందిన గణాంకాల ప్రకారం, డీజిల్ పంపిణీ రోజువారీ సగటు 7,348 కేఎల్ నుంచి ఏకంగా 210 శాతం పెరిగి 22,782 కేఎల్‌కు చేరుకుంది. అదేవిధంగా పెట్రోల్ పంపిణీ కూడా సగటు కంటే 132 శాతం పెరిగి 13,622 కేఎల్‌గా నమోదైంది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,536 అవుట్‌లెట్లకు 3,817 ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా సరఫరా కొనసాగుతోంది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో “డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై కమిటీ”లను ఏర్పాటు చేయడంతో పాటు, పౌరసరఫరాలు, రెవెన్యూ , పోలీస్ అధికారులను బంకుల వద్ద నిఘా కోసం మోహరించారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా హార్వెస్టర్లు , రవాణా వాహనాలకు ఇంధనం సక్రమంగా అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కావున ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.