డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తూ, అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లను తాకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సరైన విధానపరమైన పరిపాలన, పెట్టుబడుల ఆకర్షణ , ఉద్యోగాల కల్పన ద్వారా రాష్ట్రం నేడు దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు
రాష్ట్ర ఆర్థిక పురోగతికి అద్దం పడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4,18,931కి చేరింది. గత ఏడాదితో పోలిస్తే ప్రజల తలసరి ఆదాయంలో ఏకంగా రూ. 38,900 పెరుగుదల నమోదవ్వడం విశేషం. కేవలం ఒకే ఏడాది వ్యవధిలో 10.23% వృద్ధి రేటును సాధించి తెలంగాణ ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పారదర్శక పాలనతో నూతన ఉత్సాహం
గత దశాబ్ద కాలంగా ఉన్న లోపాలను, అస్తవ్యస్తమైన పరిపాలనా విధానాలను సరిదిద్ది, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. సమర్థవంతమైన ప్రణాళికలు, సుపరిపాలన , ఆర్థిక క్రమశిక్షణే ఈ అసాధారణ వృద్ధికి ప్రధాన కారణాలని ఆయన అభిప్రాయపడ్డారు. నాటి లోపాలను సరిదిద్దడం ద్వారా నేడు ప్రజల్లో నూతన ఉత్సాహం, నమ్మకం నింపగలిగామని, ఇదే వేగంతో రాష్ట్రాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

