ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్మీడియట్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి MPC, BiPC గ్రూపులే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెజారిటీ విద్యార్థులు ఈ కోర్సుల వైపు పరుగులు తీస్తుంటారు. ఈ క్రమంలో HEC, CEC గ్రూపులకు ఆదరణ తగ్గిపోతున్న తరుణంలో, ఒక గిరిజన విద్యార్థి తన స్పష్టమైన లక్ష్యంతో అందరి కళ్లు తెరిపించాడు. పదవ తరగతిలో 500కు పైగా స్కోరు సాధించిన ఏ విద్యార్థి అయినా సహజంగానే కార్పొరేట్ కాలేజీల వైపు చూస్తారు. కానీ, హర్ష మాత్రం తన లక్ష్యం పట్ల ఉన్న స్పష్టతతో గురుకుల కాలేజీని వెతుక్కుంటూ వచ్చాడు. తనకి HEC (History, Economics, Civics) గ్రూపులో సీటు కావాలని అడిగినప్పుడు, అక్కడి లెక్చరర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇంత మంచి మార్కులు వచ్చిన అబ్బాయి వారం రోజుల్లో మనసు మార్చుకుని మళ్ళీ MPCకో, BiPCకో వెళ్తాడని అందరూ అనుకున్నా కానీ, హర్ష ఆ అంచనాలను తలకిందులు చేశాడు.
Also Read:Sudheer- Deepika Pilli : వెకేషన్లో సుధీర్ – దీపికా.. సీక్రెట్ లవ్ బట్టబయలు?
తరగతి గదిలో పాఠాలను వినడమే కాదు, వాటి లోతుపాతులను చర్చించడంలో హర్షది ప్రత్యేక శైలి. అతని ఆసక్తిని, సబ్జెక్టుపై ఉన్న పట్టును చూసి CEC లో జాయిన్ అయిన మరో ఐదుగురు విద్యార్థులు తమ గ్రూపును HECకి మార్చుకున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే, సెల్ఫ్ ప్రిపరేషన్ మరియు గ్రూప్ డిస్కషన్స్తో ఆడుతూ పాడుతూ చదువును సాగించాడు. ఫలితంగా తాజాగా విడుదలైన 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో 492/500 మార్కులు సాధించి స్టేట్ 2nd ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. హర్ష సాధించిన విజయం ఒక ఎత్తు అయితే, అతడిని చూసి గ్రూపు మార్చుకున్న ఆ ఐదుగురు విద్యార్థులలో ముగ్గురు 430+ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. సామాన్య విద్యార్థులను స్టేట్ లెవల్ ర్యాంకర్ల స్థాయికి చేర్చడంలో ‘మంచి స్నేహం’ ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో ఈ ఘటనే నిదర్శనం. ప్రభుత్వ కాలేజీలు అంటే కేవలం పాస్ మార్కులకే పరిమితం అనే అపోహను ఈ విద్యార్థులు పటాపంచలు చేస్తున్నారు. గతేడాది (2025) ఇంటర్ ఫలితాల్లో ఇదే కాలేజీకి చెందిన ఫర్హాన్ అనే విద్యార్థి CEC 495/500 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది గిరిజన తెగకు చెందిన హర్ష స్టేట్ 2nd ర్యాంక్తో ఆ వారసత్వాన్ని కొనసాగించాడు. సివిల్స్ సాధించాలనే బలమైన సంకల్పంతో, ఇంటర్మీడియట్ లోనే ఇంతటి పరిణితిని హర్ష ప్రదర్శించడం గర్వకారణం.