కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్లైన్ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది.. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ జరగనుండగా.. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతుందని.. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణకు అనుమతి ఇవ్వనున్నట్టు హైకోర్టు తెలిపింది.. కేసు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టులో ఆగస్టు 8వ తేదీ వరకు ఆన్ లైన్ లోనే విచారణ కొనసాగనుంది.
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా కోర్టులు, ట్రిబ్యునళ్లకు మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు.. కోర్టులు, ట్రిబ్యునళ్లలో సెప్టెంబరు 9వరకు పాక్షిక ప్రత్యక్ష విచారణలు కొనసాగించాలని.. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆగస్టు 8వరకు ఆన్ లైన్ లోనే కేసుల విచారణ జరగాలని.. టీకా వేసుకున్న న్యాయవాదులకే కోర్టులోకి అనుమతి ఉంటుందని పేర్కొంది. న్యాయవాదులు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు.