IFS Transfers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖలో కీలక మార్పులు చేస్తూ పెద్ద ఎత్తున బదిలీల ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 12 మంది ఐఎఫ్ఎస్ (IFS) , నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ, వారికి కొత్త బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరిట జీవో విడుదలయ్యింది. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీలలో భాగంగా ఎస్. రమేష్ను హైదరాబాద్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్గా నియమించగా, ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీన్గా బి. ప్రవీణను నియమించారు. అలాగే వికారాబాద్ డీఎఫ్వోగా విధులు నిర్వహిస్తున్న జి. జ్ఞానేశ్వర్ను అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా జిల్లా అటవీ అధికారుల (DFO) నియామకాల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. చ. బాలమణిని కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ డీఎఫ్వోగా, బోగా నిఖితను వరంగల్ డీఎఫ్వోగా బదిలీ చేశారు. ములుగు జిల్లా డీఎఫ్వోగా వికాస్ మీనా, మహబూబ్నగర్ జిల్లాకు శివ్ ఆశీష్ సింగ్, నిజామాబాద్ జిల్లాకు సిద్ధార్థ విక్రమ్ సింగ్ కొత్త అధికారులుగా నియమితులయ్యారు. మంచిర్యాల డీఎఫ్వోగా రాహుల్ కిషన్ జాదవ్, కామారెడ్డికి నీరజ్ కుమార్ తిబ్రేవాల్ , ఖమ్మం జిల్లాకు అనుజ్ అగర్వాల్ను ప్రభుత్వం కేటాయించింది. వీరికి తోడుగా ఎస్. సత్యనారాయణకు రాజన్న సిరిసిల్ల , కరీంనగర్ జిల్లాల ఉమ్మడి డీఎఫ్వో బాధ్యతలను అప్పగించారు. తక్షణమే అమలులోకి వచ్చే ఈ బదిలీలు రాష్ట్రంలోని అటవీ సంరక్షణ , పరిపాలనను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
