తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన తర్వాత.. వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతోంది.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాస్బుక్ కూడా చేతిలో పెట్టేస్తున్నారు అధికారులు.. అయితే, ధరణిలో కొన్ని సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.. ఇక, వాటి పరిష్కారానికి రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి.. దీంతో.. ఆ సమస్యలు త్వరితగతిని పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది ప్రభుత్వం.. ధరణి కి సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు తాజాగా.. వాట్సాప్, ఈ మెయిల్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.. రైతులకు ఏమైనా సమస్యలుంటే ascmro@telangana.gov.in మెయిల్ ద్వారా లేదంటే 9133089444 నంబర్కు వాట్సాప్ చేయవచ్చని.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సోమేశ్కుమార్ వెల్లడించారు.. ఇక, సమస్యలు పెండింగ్లో పెట్టకుండా.. వెంటనే పరిష్కరించేందుకు వీలుగా.. ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. ఈ కమిటీలో.. సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగ అధికారులు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు సీఎస్.