తెలంగాణ బీజేపీలో నిధుల గోల్మాల్ గుసగుసలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్ భారీగా నిధులను పంపినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవడమే కాకుండా, నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ పంపిన నిధులకు మరియు ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు, గెలిచిన వార్డులకు ఏమాత్రం పొంతన లేదని ఢిల్లీ నేతలు గుర్తించారు. ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా వార్డులను విభజించి భారీగా ఫండ్ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, పంపిన నిధులను కొందరు నేతలు తమ స్వప్రయోజనాల కోసం ‘బొక్కేశారని’, అభ్యర్థులకు సరైన సమయంలో నిధులు అందలేదని సమాచారం అందడంతో హైకమాండ్ సీరియస్ అయింది.
Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్కు గుడ్బై..! ఈ సింపుల్ టిప్స్తో వంటగది కూల్గా మార్చుకోండి.!
ఈ నిధుల గోల్మాల్పై ఇప్పటికే ఒకటి రెండుసార్లు పోస్ట్మార్టం నిర్వహించిన రాష్ట్ర బీజేపీ ఇన్-ఛార్జ్ అభయ్ పాటిల్, ఇప్పుడు లోతైన దర్యాప్తునకు ఆదేశించారు. నిధులు పక్కదారి పట్టిన విషయంలో ఏం చేయాలనే దానిపై ఆయన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ విచారణ కోసం ప్రత్యేకంగా కొందరు నేతలను ఎంపిక చేసి, ఒక్కో జిల్లాకు ఒక్కో నేతను పంపనున్నారు. పార్టీ నియమించిన ఈ నేతలు నేరుగా గ్రౌండ్ లెవల్లోకి వెళ్లి, పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడనున్నారు. వారికి పార్టీ నుంచి అందిన డబ్బులు ఎన్ని? ఆ వార్డు ఏ కేటగిరీలో ఉంది? నిధుల పంపిణీలో పద్ధతి ప్రకారం జరిగిందా లేదా? వంటి అంశాలపై వీరు ఆరా తీయనున్నారు.
నివేదిక అందిన తర్వాత బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అభయ్ పాటిల్ భరోసా ఇచ్చారు. కేవలం నిధుల విషయమే కాకుండా, పార్టీ శిక్షణ తరగతులు ఎలా జరుగుతున్నాయి మరియు పార్టీ క్రమశిక్షణ వంటి అంశాలపై కూడా పూర్తిస్థాయి రిపోర్టులను అధిష్టానం కోరినట్లు సమాచారం. ఈ నివేదికల అనంతరం తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
