Telangana: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు, రగులుతున్న సామాజిక అంశాల నడుమ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టండి.. సీఎం రేవంత్ ఆదేశం
అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రతీ ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. ముఖ్యంగా నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల (ఇరిగేషన్) ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణపై అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావని తేల్చిచెప్పారు. భూసేకరణ, పరిహారం (R&R), ఫారెస్టు క్లియరెన్సులకు సంబంధించి నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పనులను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఎన్ని రోజులు? స్పీకర్ నేతృత్వంలో బిఏసి (BAC) భేటీ
ఈ వర్షాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై తొలి రోజు సభ ముగిసిన తర్వాత స్పష్టత రానుంది. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరగబోయే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (BAC) సమావేశంలో ఉభయ సభల పనిదినాలపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సెషన్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులతో పాటు కొన్ని విధానపరమైన నిర్ణయాలను సభ ముందుకు తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.
విపక్షాల అస్త్రాలు.. వేడెక్కనున్న శాసనసభ
మరోవైపు ప్రజా సమస్యలను అస్త్రాలుగా మలుచుకుని ప్రభుత్వాన్ని సభలో గట్టిగా కార్నర్ చేసేందుకు ప్రధాన ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల తక్షణ విడుదల, రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన వివాదాస్పద 22ఏ జీవో అమలుపై సభలో నిలదీసేందుకు విపక్షాలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ కీలక అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య పదునైన వాదనలు జరిగే అవకాశం ఉండటంతో ఈ సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

