Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు

  • కడియం శ్రీహరి అబద్ధాలు చెబుతున్నారని రాజయ్య విమర్శలు
  • కాళేశ్వరం, రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
  • ఘనపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్
  • కాంగ్రెస్, కమిషన్ల రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు
Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

స్టేషన్ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వారం రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూ కడియం శ్రీహరి అబద్ధాలు మాట్లాడుతూ ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలన్నీ చిన్నపిల్లల చిలిపి చేష్టలు, కారుకూతల్లాగే ఉన్నాయని మండిపడ్డారు.

కాళేశ్వరం అద్భుతం.. రేవంత్ రెడ్డిది ఆంధ్రకు నీటి దోపిడీ కుట్ర

ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతం, వరప్రదాయని, మానస పుత్రిక అని పొగిడిన కడియం శ్రీహరి, నేడు మాటమార్చి కాళేశ్వరం కాదని కుళేశ్వరం అనడం ఆయన నైజానికి నిదర్శనమని రాజయ్య విమర్శించారు. దేవాదులకు కడియం సృష్టికర్త కాదని, వినాశక కర్త అని ధ్వజమెత్తారు. తెలంగాణను ఎండబెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిని దోచిపెట్టేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, 16 రిజర్వాయర్లకు నీరందించే కల్పతరువు అని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు చెడ్డపేరు తేవడానికే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, ఇప్పుడు NDSAకి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రేవంత్ కరువు.. ఘనపూర్‌లో కడియం కరువు

రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపైనా, రైతుల సమస్యలపైనా కనీస అవగాహన లేదని రాజయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన వల్ల కరువు వస్తే, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వల్ల కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు. నకిలీ కాంగ్రెస్‌లోకి వెళ్లిన కడియం శ్రీహరి, ఎమ్మెల్యేగా ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కడియం కేవలం కమిషన్లు వచ్చే పనులపైనే దృష్టి పెడతారని, కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుల అంచనాలు పెంచిన చరిత్ర ఆయనదని తీవ్ర ఆరోపణలు చేశారు.

చర్చకు సిద్ధమా? అంబేద్కర్ విగ్రహం వద్దకు రా అని సవాల్

నియోజకవర్గానికి ఎవరు ఎంత చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావలసిందిగా కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. “నేను చేసిన అభివృద్ధి పనులపై, నువ్వు చేసిన పనులపై చర్చకు సిద్ధం.. స్టేషన్ ఘనపూర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలి” అని సవాల్ చేశారు. అలాగే అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు పదవులు రాకుండా కడియం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. “ఎక్కువ మాట్లాడకుండా కుక్కిన పేనులాగా ఉండు బిడ్డా” అంటూ కడియం శ్రీహరికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.