NTV Telugu Site icon

Tammineni Veerabhadram: కామ్రేడ్స్‌ రివర్స్‌ గేర్‌..! కేటీఆర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన తమ్మినేని..

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది… అయితే, ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి… కమ్యూనిస్టులకు చెప్పుకోదగిన ఓటింగ్‌ ఉండడంతో.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వారితో పొత్తుకోసం ప్రయత్నాలు చేశాయి.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే.. టీఆర్ఎస్‌కే సాధ్యం.. అందుకే.. తమ మద్దతు.. గులాబీ పార్టీకేనని ప్రకటించాయి సీపీఎం, సీపీఐ.. అయితే, మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక విషయంలో చేసిన కామెంట్లను తప్పుబట్టారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. రూ.18,000 కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నికలో విత్ డ్రా చేసుకుంటారా? దేశ అభివృద్ధికి నిధులు ఇస్తున్నా అని మోడీ చెప్తున్నారు.. అయితే మీరు విత్ డ్రా చేసుకుంటారా..? అని ప్రశ్నించారు తమ్మినేని.

Read Also:Kerala Black Magic Case: నరబలి కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. చంపి వండుకుని తినేసిన భార్యాభర్తలు!

నిధులు ఇస్తే అనే మాటలు.. బీజేపీతో లూజ్ నెస్ ఉంటుంది అనే భావన వస్తుందన్నారు తమ్మినేని వీరభద్రం.. బలహీనత మాటల్లో కనపడుతుంది.. దానిని మేం తప్పుపడుతున్నామన్న ఆయన.. జగదీష్ రెడ్డి అంటే ఏదో అన్నారు లే అనుకోవచ్చు.. కేటీఆర్ కూడా అలాంటి మాటలు మాట్లాడటం సరికాదని హితవుపలికారు.. నిధులు ఇస్తే మీ వైఖరి మార్చుకుంటారా? అని నిలదీశారు వీరభద్రం. ఇక, లెఫ్ట్ పార్టీలు కలిసి పని చేయాలనే ఉమ్మడి సమావేశం నిర్వహించామని తెలిపారు.. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని స్పష్టం చేసిన ఆయన.. టీఆర్ఎస్‌ తో కలవాలని కానీ.. వద్దు అనే భావన కానీ మాకు లేదని.. అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు.. కోటమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమ్యూనిస్టులపై అనేక అఘాయిత్యాలు చేశారని మండిపడ్డారు సీపీఎం తెలంగాణ చీఫ్‌.. క్షుద్రపూజలు, మనుధర్మం.. చరిత్ర మార్పు చేయడం మొదలు పెట్టింది బీజేపీయేనన్న ఆయన.. కేసీఆర్ యజ్ఞాలు.. యాగాలు చేస్తారు అంతే.. కానీ, బీజేపీలా కాదన్నారు. ఇక, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగానే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు తమ్మినేని వీరభద్రం. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌తో పాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. టీఆర్ఎస్‌ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తున్నారు.. వారికి మద్దతుగా ప్రచారం చేస్తూనే.. వారు లైన్ తప్పి చేసే కామెంట్లను మాత్రం తప్పుబడుతున్నారు కామ్రేడ్స్.