Telangana Animal Husbandary, Fisheries and Cinematography Minister Talasani Srinivas Yadav Fired on Telangana BJP Leaders.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. నిన్న తెలంగాణ మంత్రులు యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని పీయూష్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. ఎఫ్సీఐ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. పీయూష్ గోయల్ అసలు మంత్రేనా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్కు బాధ్యత ఉందా? తెలంగాణలో పండేది బాయిల్డ్ రైస్. రా రైస్ కొంచెం ఉత్పత్తి అవుతది. దేశంలో ఆకలి తీర్చే పరిస్థితులు కేంద్రానికి ఉండాలి. తెలంగాణ బీజేపీ కొంటవ, చస్తావా అంటుంది అని ఆయన మండిపడ్డారు.
దేశంలో బీజేపీలు రెండు ఉన్నాయా? అసలు బీజేపీ నేతలకు మెదడు ఉందా? కేంద్రంలో అధికారంలో ఇచ్చింది ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటానికా? అని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, దేశంలో పరిపాలన నడుస్తుందా? సికింద్రాబాద్ పార్లమెంట్ కు ఒక్క రూపాయి అయిన తెచ్చినవా కిషన్ రెడ్డి? అని ఆయన ప్రశ్నించారు. ఒకట్రెండు ఉప ఎన్నికల్లో గెలువంగానే అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోరని, టైమ్, అవకాశం వస్తే కేంద్రంలో ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు. మీ నాయకులు నూకలు తింటారా, వాళ్ళు తింటామని ప్రజలకు చెప్పించండన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ నూకలు తింటారా? మీ ముఖానికి దేశంలో ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆయన అన్నారు. జీఎస్టీ, డీ మానిటైజేషన్ తెచ్చి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేశారని, ధాన్యం కొనుగోలు రాజ్యాంగ పరమైన హక్కు.. మేమేమైన అడుక్కు తినే వాళ్ళమా? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొట్టగొట్టే కార్యక్రమాలు బీజేపీ నాయకులు చేయొద్దని, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి నూకలు తినిపించాలి. ఆ తర్వాత మిగతా వారికి చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ఇప్పటికి వందసార్లు పెంచారని ఆయన ఆరోపించారు.
