Site icon NTV Telugu

Hyderabad: మొబైల్ టాయ్‌లెట్‌ చోరీ.. తుక్కుగా మార్చి రూ.45వేలకు విక్రయం

హైదరాబాద్‌ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. ఓ దొంగ మొబైల్ టాయ్‌లెట్‌ను చోరీ చేసిన వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16న సఫిల్‌గూడ చౌరస్తాలోని మొబైల్ టాయ్‌లెట్ కనిపించకపోవడంతో పారిశుధ్య కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేశారు.

మొబైల్ టాయ్‌లెట్‌ను తీసుకెళ్లిన నిందితుడు దోమల్‌గూడలో నివసించే మెదక్‌ జిల్లా అందోల్‌ మండలం అమ్మసాగరానికి చెందిన ముప్పారం జోగయ్య(36)గా పోలీసులు గుర్తించారు. అతడు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఈ పనికి పాల్పడినట్లు వెల్లడించారు. తనకు జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం ప్రకటనల విభాగంలో పని చేస్తున్న అరుణ్‌కుమార్‌, జైన్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో సూపర్‌వైజర్‌గా పని చేసే భిక్షపతి సహకారం అందించారని నిందితుడు విచారణలో అంగీకరించాడు. మొబైల్ టాయ్‌లెట్‌కు వినియోగించిన ఇనుప ఫ్రేమ్‌లను తుక్కుగా మార్చి రూ.45వేలకు విక్రయించినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. కాగా నిందితుడిని రిమాండ్‌కు తరలించి మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

https://ntvtelugu.com/big-income-coming-from-pending-traffic-challans-in-telangana/
Exit mobile version