MLAs Purchase Case: ఫాంహౌస్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. బండి సంజయ్ అనుచరుడికి సిట్‌ నోటీసులు

Mlas Purchase Case

Mlas Purchase Case

తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్‌ వైరల్‌గా మారిపోయింది.. నేతలకు, కోర్టులకు, వ్యవస్థలకు ఇలా అందరికీ.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పంపించారు సీఎం కేసీఆర్‌.. మరోవైపు.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం విచారణ కోసం నియమించిన చిట్‌.. దర్యాప్తులో దూకుడు పెంచింది… విచారణలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చింది.. ఈ నెల 21వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఫాంహౌస్‌ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతికి శ్రీనివాస్‌.. ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి..

Read Also: Dadisetti Raja: చంద్రబాబుకి ముందే అర్థమైంది.. ఎన్నికలకు ముందే సింగపూర్ పారిపోతారు..!

కాగా, మొయినాబాద్ ఫాంహౌస్‌లో నలుగురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన కేసులో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌ను గత నెలలో అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హర్యానాలో సోదాలు నిర్వహించిన సిట్ టీమ్.. కేరళలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు.. బండి సంజయ్‌ అనుచరుడికి సిట్‌ నోటీసులు ఇవ్వడం చర్చగా మారింది. ఇక, కరీంనగర్‌లోని శ్రీనివాస్ ఇంటికి నోటీసులకు సంబంధించిన కాపీని అంటించింది సిట్‌ టీమ్.. సిట్ అడిగిన వివరాలు ఏవీ.. ఎవరికి వెల్లడించొద్దు అని శ్రీనివాస్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.