Bhatti Vikramarka : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం చేసిన నిర్విరామ కృషి ఫలించింది. సింగరేణి సంస్థకు ఊపిరిపోసేలా ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్ను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపు పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తాను కలిసి కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ బ్లాక్ కేటాయింపునకు అంగీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
గనుల సాధనకై ప్రజా ప్రభుత్వ నిరంతర పోరాటం
తాడిచర్ల-2 బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని కోరుతూ తాము చేసిన సుదీర్ఘ ప్రయత్నాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మార్చి 2024లో న్యూఢిల్లీలో అప్పటి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేశామని, ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా జరిగిన బొగ్గు బ్లాక్ల వేలంలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి వివరించామని తెలిపారు. అనంతరం నవంబరు 2024లో, అలాగే ఇటీవలి మే నెల ఢిల్లీ పర్యటనలో కూడా కేంద్ర బొగ్గు శాఖపై ఒత్తిడి తెచ్చామన్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి తాడిచర్లతో పాటు ఇతర బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలని కోరారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూలనపడిన ఒడిశా ‘నైనీ’ బొగ్గు బ్లాక్కు ప్రత్యేక చొరవతో అన్ని అనుమతులు సాధించి, ఉత్పత్తి ప్రారంభించామని, ఇప్పుడు తాడిచర్ల-2 సాధించడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు.
సింగరేణికి వరంగా మారనున్న తాడిచర్ల-2 గని
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న తాడిచర్ల ఓపెన్ కాస్టు-2 గని సింగరేణి భవిష్యత్తుకు ఒక వరంగా మారనుంది. ఈ గనిలో మొత్తం 434.14 మిలియన్ టన్నుల నిల్వలు ఉండగా, అందులో దాదాపు 340 మిలియన్ టన్నుల మేలైన ‘జీ-9’ రకం బొగ్గును వెలికితీసే అవకాశం ఉంది. ఇక్కడి నుండి ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలతో సింగరేణి సంస్థకు మరో 40 సంవత్సరాల పాటు నిరంతరాయంగా మైనింగ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇది సింగరేణి వార్షిక లక్ష్యమైన 100 మిలియన్ టన్నుల ఉత్పత్తిని చేరుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా , పరోక్షంగా సుమారు 3,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ప్రాంతీయ అభివృద్ధి.. విద్యుత్ రంగానికి భరోసా
ఈ కొత్త గని ఏర్పాటుతో భూపాలపల్లి ప్రాంత సామాజిక, ఆర్థిక చిత్రపటం పూర్తిగా మారిపోనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. మైనింగ్ అవసరాల కోసం ఇక్కడ రైలు, రోడ్డు నెట్వర్క్తో పాటు ఇతర మౌలిక వసతులు భారీగా అభివృద్ధి చెందుతాయన్నారు. అన్నింటికీ మించి, రాష్ట్ర పారిశ్రామిక రంగానికి , విద్యుత్ ప్రాజెక్టులకు దీర్ఘకాలికంగా ఎలాంటి అంతరాయం లేకుండా బొగ్గు సరఫరా జరిగేలా ఈ తాడిచర్ల-2 బ్లాక్ గట్టి భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ఇతర బొగ్గు బ్లాకులను కూడా సంస్థకే కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు.

