శిల్ప కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే… శిల్పా బాధితులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే సీజ్ చేసిన శిల్పా ఫోన్ నుండి పలు నెంబర్ల గుర్తించారు పోలీసులు. శిల్పా బాధితుల్లో ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే.. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులను వసూలు చేసిన శిల్పా… అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పేరుతో వసూలు చేసింది.
కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత మొహం చాటేశారు శిల్పా దంపతులు. వసూలు చేసిన కోట్ల రూపాయలను ఎక్కడ, ఏం చేసిందన్న దాని పై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు నాలుగు అకౌంట్లు గుర్తించినా… ఆ అకౌంట్లలో కేవలం వేలల్లోనే నగదు ఉన్నట్లు గుర్తించారు. శిల్ప అకౌంట్లను ఫ్రీజ్ చేసిన పోలీసులు… వసూలు చేసిన కోట్ల రూపాయల పైనే దృష్టి సారించారు. ఆ డబ్బుతో ఏం చేశారు? ఎక్కడైనా బిజినెస్ లో పెట్టారా? లేక భూములు కొనుగోలు చేశారా? అనే అంశాల పైనే నిఘా పెట్టారు పోలీసులు. ఇక అటు తమ దగ్గరి నుండే కోట్ల రూపాయలు తీసుకుందంటూ శిల్పా పై ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. అయితే.. ఈ కేసులో ఇవాళ మరి కొంత మందిని విచారించే అవకాశం ఉంది.