తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ బృందం ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీ బలోపేతం , భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్ర నాయకత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో భాగస్వామి కానున్నారు. 19వ తేదీ ఉదయం ఢిల్లీకి చేరుకోనున్న వీరు, కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ , కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో పాలన మొదలై ఏడాది దాటిన క్రమంలో, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు.
Emmanuel Macron: ముంబై రోడ్లపై సామాన్యుడిలా ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్.. వీడియో వైరల్
ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా గ్యారెంటీల అమలు తీరుపై అధిష్టానం సమీక్షించనుంది. ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ నిర్మాణం, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం , పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. అలాగే విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం , భవిష్యత్తు ఎన్నికల వ్యూహాల గురించి రాహుల్ గాంధీ స్వయంగా నాయకులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే 19వ తేదీ ఉదయం తెలంగాణ నేతలతో సమావేశమై, అదే రోజు సాయంత్రం మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో భేటీ కానుంది. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు, ప్రభుత్వం , పార్టీ మధ్య సమన్వయాన్ని పెంచడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ భేటీ తర్వాత తెలంగాణ క్యాబినెట్లో మార్పులు లేదా చేర్పులు ఉండొచ్చనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
Sri Lanka-T20 World Cup: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ప్రయాణం.. లంకేయులు ఎప్పుడూ పోటీదారులే!
