రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయబోమని తాను ఒట్టు పెట్టుకున్నానని, అందుకే ‘పాపాల భైరవుడ్ని’ ఫాంహౌస్లో బంధించామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాయమాటలు, మూటలతో ఎన్నికలకు వస్తున్నా కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని తాను ఆనాడే చెప్పానని, అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో కలిపి సీట్లు సాధించి అధికారంలోకి వచ్చామన్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు సున్నా సీట్లు వస్తాయని తాను చేవెళ్ల సభలో చెప్పిన మాట నిజమైందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో జరగబోయే పొలిటికల్ కురుక్షేత్రంలో గెలిచేది మళ్లీ కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని, 2028 డిసెంబర్లో కాకుండా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 25 పార్లమెంట్, 182 అసెంబ్లీ స్థానాలతో 2029 జూన్లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు.
కల్వకుంట్ల కుటుంబంలోనే అనేక కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని, ఆ ఇంట్లో ఒకరిని చూస్తే ఒకరికి పడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బావబావమరుదులైన హరీష్ రావు, కేటీఆర్లకు తండ్రి కేసీఆర్ రాజ్యం ఇవ్వడం లేదనే గిల్లికజ్జాలు, పోటాపోటీలు ఉన్నాయని, వీరిద్దరూ చింతకాని సభ వద్ద ఆడుకోవాలంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ సర్వేలు బ్యాండ్ మేళం వాయించినట్లుగా ఉన్నాయని, తలకాయలో చింతకాయంత మెదడు కూడా లేనివారే అలాంటి బోగస్ సర్వేలు నమ్ముతారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై మండిపడుతూ.. “బుర్ర తక్కువ వాళ్లు.. మేడిగడ్డ తెగిపోయిన తరుణంలో అక్కడ నీళ్లు నింపితే భద్రాచలం రామాలయం మునిగిపోదా? మీ రాజకీయాల కోసం భద్రాచలం రాముడు మునగాలా?” అని ప్రశ్నించారు. అలాగే, తాము బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకోలేదని భద్రాచలం రాముడి మీద, మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పే ధైర్యం హరీష్ రావుకు ఉందా అని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడం అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కని, రైతుల కళ్లలో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “కరెంట్ వైర్ అయినా పట్టుకోండి లేదా కల్వకుంట్ల కుటుంబాన్నైనా పట్టుకోండి.. కాకి మాదిరిగా నల్లగా మాసి మసి అవ్వడం ఖాయం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ నిరుద్యోగుల కలలను పూర్తిగా నరకప్రాయం చేశారని మండిపడ్డారు. ఖమ్మం రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. పువ్వాడ అజయ్ వంటి ‘ఒంటికన్ను రాక్షసులు’ చాలా మంది ఉన్నారని, ప్రజలు వారికి బుద్ధి చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కవని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమి అత్యధిక స్థానాలు సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

