తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఇప్పటికే రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.. అంతా ఒక కుటుంబంగా.. ఒక్కటిగా ముందుకు సాగాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. దీంతో.. కలసి కట్టుగా నడుస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఇటీవల జరిగిన పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో ఒక్కటిగా కనిపించారు. మరోవైపు.. కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు రాష్ట్రంలో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ.. ఇప్పటికే తెలంగాణలో రాహుల్ పర్యటనపై చర్చ నడుస్తుండగా.. ఇవాళ రాహుల్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ.. మే 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటనను ఖరారు చేశారు.
Read Also: COVID 4th Wave: కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే.. భారత్లో ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయ్యిందా..?!
మే 6వ తేదీన వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో జరగనున్న భారీ బహిరంగసభకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ.. దీని కోసం మే 6న మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకోనున్నారు.. హైదరాబాద్ నుంచి సాయంత్రం వరంగల్ సభకు హాజరవుతారు రాహుల్.. ఇక, 7 వ తేదీన బోయిన్ పల్లిలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొంటారు.. అమరవీరుల కుటుంబాలు, ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలు, రైతులతో రాహుల్ ముఖా ముఖి నిర్వహించనున్నారు.. తర్వాత పార్టీ నాయకులు… కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. కాగా, పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది. సుమారు 40 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది.. టీఆర్ఎస్ను గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాలతో ముందుకు సాగాలని భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ టూర్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.