సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ లను తానూ ఎదుర్కొన్నానని పీవీ సింధు అన్నారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘మహిళలు, పిల్లలకు సైబర్ వరల్డ్ పై చైతన్య కార్యక్రమం’ అనే అంశంపై శనివారం రాష్ట్రంలోని వివిధ పాఠశాలలోని సైబర్ అంబాసిడర్లకు ప్రత్యేక చైతన్య కార్యక్రమమం నిర్వహించారు. ఈ చైతన్య కార్యక్రమానికి ప్రముఖ షెట్లర్ పీ.వీ సింధు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతీ లక్రా, ఐ.జీ. బి.సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడారు. సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్లను ధైర్యంగా ఎదుర్కోవడం తోపాటు వీటిపై పోలీస్ శాఖలోని సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా షీ -టీమ్ లు మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక భరోసాగా మారాయని పీ.వీ. సింధు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన ఇంటర్నెట్ వినియోగంతో సైబర్ నేరాలు కూడా భారీగా పెరిగాయని సింధు అభిప్రాయపడ్డారు. ఈ నేరాలు ప్రధానంగా మహిళలు, పిల్లల కేంద్రీకృతంగా అధికమవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు షీ-టీమ్లున్నాయనే భరోసాను ఎలాగైతే కల్పించాయో, సైబర్ మోసాలకు గురైతే, వెంటనే తమకు సైబర్ వారియర్లు ఉన్నారనే ధైర్యాన్ని కల్పించాలని సింధు పేర్కొన్నారు.
సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిరంతర శ్రమ, అభ్యాసం ద్వారానే చాంఫియన్ అవుతారన్నారు. ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు ఏదో ఒక వ్యాయామం చేయాలని సూచించారు. తమ పిల్లలను తల్లి, తండ్రులు నిరంతరం గమనిస్తుండాలన్నారు. ఏవైనా సమస్యలను పిల్లలు ఎదుర్కొంటే వాటిని అర్థం చేసుకుని అధిగమించే చైతన్యాన్ని కల్పించాలని సింధు తెలిపారు. ఇంటర్నెట్ వినియోగం నిత్యజీవితంలో ఒక భాగమైపోయిందన్నారు. వీటిలో విద్యాపరమైన, స్ఫూర్తిదాయక, క్రీడా కార్యక్రమాలతోపాటు మానసిక వికాస కార్యక్రమాలను చూడడానికి ప్రాధాన్యతను ఇచ్చే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కోవిడ్ నేపథ్యంలో మొబైల్ వాడకం పెరిగింది: స్వాతి లక్రా, అడిషనల్ డీజీ
అనంతరం అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ, ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో పెరిగిన మొబైల్ వాడకం ద్వారా సైబర్ నేరాలు కూడా పెరిగాయని అన్నారు. ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి రాష్ట్రం లోని ప్రతీ పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థినులు, ఒక మహిళా ఉపాధ్యాయినికి సైబర్ నేరాలను ఎదుర్కోనేందుకు సైబర్ కాంగ్రెస్ అనే పేరుతొ ప్రత్యేక శిక్షణ ఇప్పించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది మహిళా ఉపాధ్యాయులకు, 3500 విద్యార్థినులకు ఈ శిక్షణ ఇప్పించామని స్వాతి లక్రా వెల్లడించారు.