దసరా పండుగ వేళ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యర్ధులకు శుభవార్త అందించింది. కటాఫ్ మార్కులు తగ్గిస్తూ జీవో విడుదల చేసింది. పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కటాఫ్ మార్కులను తగ్గిస్తూ జీవో విడుదల చేసింది. ఇటీవల జరిగిన పోలీస్ నియామక పరీక్షల్లో అన్ని కేటగిరీల అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలో 60 మార్కులు కేటాయించడంపై తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తగా.. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. పోలీసుల అర్హత పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని వెల్లడించారు. అయితే.. ఈ వెసులుబాటు కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. నేడు తెలంగాణ పోలీస్ నియామక మండలి దీనిపై నిర్ణయం తీసుకుంది. కటాఫ్ మార్కులను సవరిస్తూ జీవో జారీ చేసింది.
సవరించిన జీవో ప్రకారం.. ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 20 శాతం మార్కులను కేటాయిస్తున్నట్లు అధికారిక వెబ్సైట్లో అధికారులు నోటీస్ జారీ చేశారు. దీని ప్రకారం.. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే.. ఉత్తీర్ణులవుతారు. తర్వాత నిర్వహించబోయే.. శారీరధారుడ్య పరీక్షలకు అర్హత పొందుతారన్నమాట.
Read Also: Ys Sharmila: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ మీకేం చేసారు?
గతంలో జరిగిన పోలీసు నియామక పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు 30 శాతంగా.. బీసీలకు 35 శాతంగా.. ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ.. ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులనే అర్హతగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పరీక్షలో 200 ప్రశ్నలకు గానూ… 60 మార్కులు వస్తే సరిపోతుంది. మళ్లీ ఇందులో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. దీని ప్రకారం.. ఓసీలకు 10 శాతం, బీసీలకు 5 శాతం సడలింపు ఇచ్చినట్టయింది. దీంతో.. తమకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నిరసనలు వ్యక్తం చేయగా ప్రభుత్వం స్పందించి జీవోను సవరించింది. తాజా నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Bihar: నితీష్ ప్రభుత్వానికి షాక్.. వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా..