కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో చోటుచేసుకున్న కాల్పుల కలకలంపై పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నగల దుకాణంలో సాహసోపేతంగా చోరీకి పాల్పడి, కాల్పులతో భీభత్సం సృష్టించిన నిందితులను పట్టుకోవడంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ కేసులో పురోగతి సాధించే క్రమంలో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేరంలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురు నిందితుల ఫోటోలను అధికారికంగా విడుదల చేశారు.
నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నందున, వారిని గుర్తించేందుకు ప్రజల సహకారం కోరుతున్నారు. నిందితుల జాడ కనిపెట్టి, వారి గురించి ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ. లక్ష బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, నిందితులను పట్టుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరుతూ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
