Pargi Municipal : పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వికారాబాద్ జిల్లా పరిగిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం, స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా మారడంతో ఇరు పార్టీల మధ్య ‘వార్డ్’ వార్ కాస్తా ‘కిడ్నాప్’ డ్రామాకు దారితీసింది. పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 8 వార్డుల్లో విజయం సాధించి సమానంగా నిలిచాయి. దీంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి ఇరు పార్టీల నేతలు రంగంలోకి దిగారు.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తన తల్లిని కిడ్నాప్ చేశారని ఒక స్వతంత్ర అభ్యర్థి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పరిగిలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. అయితే, పోలీసులు విచారించగా సదరు స్వతంత్ర అభ్యర్థి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ఎవరి ఒత్తిడితోనూ ఇక్కడికి రాలేదని, తన ఇష్టపూర్వకంగానే మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చానని పోలీసులకు స్పష్టం చేయడంతో కిడ్నాప్ ఆరోపణలు సద్దుమణిగాయి.
ఇదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై ప్రతిదాడికి దిగాయి. ఒక బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిని ప్రస్తుత ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డి వర్గీయులు కిడ్నాప్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడుతున్నారు. ప్రస్తుతం పరిగిలో పోలీసుల పహారా కొనసాగుతోంది. మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పట్టణంలో కొనసాగుతుండగా, క్యాంపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
