బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన , అనాథ, వీధి బాలల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మరొకసారి అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర సీఐడీ (CID) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్–12’ ద్వారా జూలై 1 నుంచి జూలై 31 వరకు చేపట్టిన నెల రోజుల సుదీర్ఘమైన ప్రత్యేక డ్రైవ్లో రికార్డు స్థాయిలో మొత్తం 6,307 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా రెస్క్యూ చేశారు.
124 ప్రత్యేక బృందాలు.. విస్తృత తనిఖీలు
ఈ ఆపరేషన్ కోసం సీఐడీ విభాగం రాష్ట్రవ్యాప్తంగా 124 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించింది. సుమారు 620 మంది పోలీసు సిబ్బందితో కూడిన ఈ బృందాలు హోటళ్లు, దాబాలు, నిర్మాణ ప్రదేశాలు, ఇటుక బట్టీలు, వర్క్షాప్లు, వ్యాపార దుకాణాలపై రాత్రింబవళ్లు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. రక్షించబడిన 6,307 మంది చిన్నారులలో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందినవారు 3,447 మంది ఉండగా, దేశంలోని ఇతర రాష్ట్రాలు , నేపాల్కు చెందినవారు 2,860 మంది కావడం గమనార్హం.
నిర్బంధాలు, వీధి బాలల రక్షణ
పోలీసులు రక్షించిన చిన్నారుల్లో అత్యధికంగా 5,041 మంది వివిధ చోట్ల బాల కార్మికులుగా కష్టపడుతుండగా, 647 మంది వీధి బాలలుగా, మరో 43 మంది భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఈ ఆపరేషన్ ద్వారా పోలీసులు మొత్తం 1,705 ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేసి, 1,710 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, కార్మిక శాఖ అధికారులు 1,381 ఇన్సపెక్టోరియల్ రిపోర్టులు జారీ చేయడంతో పాటు, కనీస వేతనాల చట్టం కింద నిందితులకు ₹37.95 లక్షల జరిమానా విధించారు.
తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు.. పునరావాస చర్యలు
రెస్క్యూ చేసిన చిన్నారుల్లో 5,737 మందిని అధికారులు వారి వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించి, కళ్లలో ఆనందాన్ని నింపారు. కుటుంబ నేపథ్యం సరిగ్గా లేని లేదా అనాథలైన 570 మంది చిన్నారులను మెరుగైన భవిష్యత్తు , సంరక్షణ కోసం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లకు (Child Care Institutions) తరలించారు. చిన్నారుల హక్కులను కాపాడుతూ, వారి భవిష్యత్తుకు వెలుగులు నింపడంలో తెలంగాణ పోలీసులు చూపుతున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు.

