Nitin Nabin : రంగారెడ్డి జిల్లా రూరల్ భారతీయ జనతా పార్టీ (BJP) నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నితిన్ నబీన్ ఘనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు వర్చువల్ విధానం ద్వారా మరో 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నితిన్ నబీన్ మాట్లాడుతూ.. నాటి నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్కు, అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. పార్లమెంట్లో నాడే తెలంగాణ వాణిని బలంగా వినిపించిన దివంగత నేత సుష్మా స్వరాజ్ సేవలను కూడా ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
పోరాటాలతోనే అధికారం.. తెలంగాణలో భగవాధ్వజం ఖాయం
గతంలో దేశవ్యాప్తంగా బీజేపీ కేవలం రెండు లోక్సభ స్థానాలు గెలిచినప్పుడు.. అందులో ఒకటి తెలంగాణ (హన్మకొండ) నుంచేనని నితిన్ నబీన్ గుర్తుచేశారు. ఈ స్థాయికి చేరడానికి ఎంతో మంది పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. తెలంగాణకు లీడర్లు ఎంతో దూరం లేరని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి మూలలోనూ కమలం వికసించి, భగవాధ్వజం ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని, ప్రజావ్యతిరేక పద్ధతులను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురైనా తీవ్రంగా సంఘర్షణ చేసి ఎలాగైతే విజయం సాధించామో, తెలంగాణలోనూ అదే పునరావృతం అవుతుందన్నారు. బెంగాల్లో పార్టీని గెలిపించిన సునీల్ బన్సల్ ఇక్కడే ఉన్నారని, తెలంగాణలో కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడి పార్టీని గెలిపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
డబుల్ ఇంజన్ సర్కార్తోనే వికసిత తెలంగాణ
ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్న ‘వికసిత భారత్’ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలి అంటే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండే ‘డబుల్ ఇంజన్ సర్కార్’ వస్తేనే తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అసలైన కలలు సాకారం కావాలన్నా, ఒక వికసిత తెలంగాణ నిర్మాణం జరగాలన్నా ప్రజలంతా బీజేపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరగబోయే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కాగా, సాయంత్రం వేళ నితిన్ నబీన్ పార్టీకి చెందిన బీఎల్ఓలు (BLO), బూత్ కమిటీ అధ్యక్షులు , ముఖ్య కార్యకర్తలతో సమావేశమై రాబోయే ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

