జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్ లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్న దన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి కెటిఆర్ కార్యదక్షతతో, గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారిని ఆత్మహత్యలనుంచి దూరం చేసి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నదన్నారు.
బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తు న్నామన్నారు. వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని సిఎం తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నామన్నారు. ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు అందిస్తున్నామని సిఎం అన్నారు. ఎగ్జిబిషన్లు , ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు బీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమలులోకి తేనున్నామన్నారు. చేనేత కార్మికులకు ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు. చేనేత కార్మికులకు అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని సిఎం తెలిపారు.